తెలంగాణలో విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్లపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్లపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని కొట్టివేస్తూ చీఫ్ జస్టిస్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. కేసీఆర్ రిట్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ కమిషన్ ఏర్పాటు చేయగా.. దాన్ని కేసీఆర్ సవాల్ చేశారు. జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిని చేర్చాలని కేసీఆర్ కోరారు. అయితే.. కేసును విచారణకు స్వీకరిస్తే జస్టిస్ నరసింహారెడ్డికి హైకోర్టు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, విద్యుత్తు కొనుగోళ్ల అంశంపై నియమించిన కమిషన్.. పూర్తి సమాచారం సేకరించక ముందే మీడియా ముందుకు వచ్చిన జస్టిస్ నరసింహారెడ్డి.. ఆ అంశంపై మాట్లాడటాన్ని కేసీఆర్ తప్పుపట్టారు.