నారాయణపేట జిల్లా మాగనూరు గురుకులంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో నారాయణపేట డీఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దవాఖానలో విద్యార్థులు
హైదరాబాద్, ఈవార్తలు : నారాయణపేట జిల్లా మాగనూరు గురుకులంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో నారాయణపేట డీఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ పాయిజన్ ఘటనపై నారాయణపేట డిప్యూటీ కలెక్టర్.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో డీఈవో అబ్దుల్ ఘనీని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. భోజనం సరఫరా చేసే ఏజెన్సీని రద్దు చేసింది. అటు.. ఆర్డీవో రామచందర్, ఎంపీడీవో, ఫుడ్ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీచేసింది.
గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తూర్పారబట్టాయి. దీంతో ఘటనపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని ఆదేశించారు. అయితే, ఫుడ్ పాయిజన్తో దవాఖానలో చేరిన విద్యార్థులకు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పురుగుల టిఫిన్ పెట్టడం మరింత అగ్గి రాజేసింది. ఉప్మాలో పురుగుల రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్ అయ్యింది. వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తాజాగా, ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యులుగా చేస్తూ డీఈవోను సస్పెండ్ చేసింది. భోజనం సరఫరా చేసే ఏజెన్సీని రద్దు చేసింది.