హైదరాబాదీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో రాత్రి వేళల్లో హోటళ్ల సమయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
చార్మినార్
హైదరాబాద్, ఈవార్తలు : హైదరాబాద్ పొద్దున 4 గంటలకు మొదలై అర్ధరాత్రి రెండు గంటల వరకు బిజీబిజీగా ఉంటుంది. సరిగ్గా రాత్రి 12 గంటల సమయంలో ట్యాంక్ బండ్పై బర్త్ డే వేడుకలు చేసుకొనేవారు ఎందరో ఉన్నారు. ఇక.. రాత్రి సమయంలో డిన్నర్కు వెళ్లేవాళ్ల సంఖ్య కోకొల్లలు. అయితే, రాత్రి 11 దాటితే అన్ని వ్యాపారాలు బంద్ చేయాల్సిందే. లేకపోతే ప్రతి షాప్ ముందు పోలీస్ వెహికల్ సైరన్ మోగుతుంది. అందులో పనిచేసేవాళ్లకు లాఠీ దెబ్బలు తాకుతాయి. రాత్రి 8 గంటలకు ఆఫీస్ ముగించుకొని, 9 గంటలకు ఇంటికి చేరి.. 9:30కు డిన్నర్కు వెళ్లేవాళ్లకు ఈ టైమింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రశాంతంగా రెస్టారెంట్లో కూడా తినలేని పరిస్థితి. షాపింగ్ చేయలేని దుస్థితి.
అయితే, హైదరాబాదీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో రాత్రి వేళల్లో హోటళ్ల సమయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్ధరాత్రి 1 గంట వరకు అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, మద్యం షాపులకు ఈ మినహాయింపు లేదని తేల్చి చెప్పారు. వైన్ షాపులకు అనుమతి ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉంటుందని, అందుకే వాటికి మినహాయింపు లేదని వివరించారు. రాత్రి 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ఇబ్బంది అవుతోందని పలువురు సీఎం దృష్టికి తేవటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.