తెలంగాణ రైతులకు బ్యాంకర్ల వడ్డీ దెబ్బ.. మిత్తి కట్టాకే రుణమాఫీ చెల్లింపులు

రైతు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పగా, బ్యాంకర్లు మాత్రం రైతుల నడ్డి విరుస్తు్న్నారు.

harish rao

మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, ఈవార్తలు : రైతు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పగా, బ్యాంకర్లు మాత్రం రైతుల నడ్డి విరుస్తు్న్నారు. రుణమాఫీ అవుతుందన్న సంతోషం కూడా ఉండనీయకుండా వడ్డీ వసూలు చేస్తూ రైతుల నుంచి వడ్డీ కోసం రిటర్న్ డబ్బులు కట్టించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఒక పోస్ట్ అందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఓ రైతు రుణమాఫీ డబ్బులకు అదనంగా వడ్డీ చెల్లించిన రసీదును జత చేస్తూ ప్రభుత్వంపై హరీశ్ మండిపడ్డారు. ‘డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీ ని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వెల్లడించారు.

‘ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్ ను, రూ.9,000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నా’ అని తెలంగాణ సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)కు ట్యాగ్ చేశారు. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గత 7 నెలలకు సంబంధించి రుణానికి వడ్డీ కట్టించుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్డీ డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్