రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని అన్నారు.
హైదరాబాద్, ఈవార్తలు : రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి. కేసీఆర్ ఒక వేగుచుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్. కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవి. ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయి’ అని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితను అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించినందుకు పలువురు నాయకులు కవితకు ధన్యవాదాలు తెలిపారు. బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యమని కవిత అన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.