ఎక్కడైనా ప్రభుత్వ భూములు కబ్జా కావడం చూస్తుంటాం. కానీ, ప్రభుత్వమే దేవుడి భూములను కబ్జా చేయాలని ప్లాన్ చేసిందా? సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఆలోచన వేరే ఉందా? అంటే హిందూ సంఘాలు, భక్తులు అవుననే అంటున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : ఎక్కడైనా ప్రభుత్వ భూములు కబ్జా కావడం చూస్తుంటాం. కానీ, ప్రభుత్వమే దేవుడి భూములను కబ్జా చేయాలని ప్లాన్ చేసిందా? సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఆలోచన వేరే ఉందా? అంటే హిందూ సంఘాలు, భక్తులు అవుననే అంటున్నారు. ప్రభుత్వం తన అవసరాల కోసం దేవుడి భూములను వాడేందుకు అధికారం ఎక్కడిది? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు కనిపించని సర్కారుకు.. హిందూ దేవాలయాల భూములే కనిపించాయా? అని నిలదీస్తున్నారు. వివరాల్లోకెళితే.. రాష్ట్రంలోని దేవాలయాల భూముల్లో సౌర విద్యుత్తు (సోలార్ పవర్)ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు కూడా రూపొందించారు. వాస్తవానికి, తెలంగాణ వ్యాప్తంగా దేవాదాయ శాఖకు పెద్దఎత్తున భూములు ఉన్నాయి. అందులో 22 దేవాలయాల పరిధిలోని 719.12 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు నెలకొల్పే దిశగా ప్రభుత్వం తన చర్యలను వేగవంతం చేసింది.
పీఎం కుసుమ్ పథకం కింద..
కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం కుసుమ్’ కింద సోలార్ ప్లాంట్లను నెలకొల్పి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబర్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతికుమారి.. 6 నెలల్లో ఆలయ భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 719.12 ఎకరాల ఆలయాల భూముల్లో అత్యధికంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే 356.34 ఎకరాల స్థలాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 109.06 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 96.36 ఎకరాలు గుర్తించారు. మిగిలిన స్థలాలు ఇతర జిల్లాల్లో ఉన్నాయి. ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తును సమీపంలోని విద్యుత్ ఉప కేంద్రాల (సబ్స్టేషన్ల)తో అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు ఆ భూములు సబ్స్టేషన్లకు ఎంత దూరంలో ఉన్నాయి? అన్న వివరాలు కూడా సేకరించారు.
దశల వారీగా సోలార్ ప్లాంట్లు
ప్రభుత్వం సోలార్ ప్లాంట్లను దశలవారీగా చేపట్టనుంది. మెదక్ జిల్లా నర్సాపూర్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 148.04 ఎకరాల భూములు ఉండగా.. అందులోని 100 ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలోని మోత్కూరు మండలం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ పరిధిలోని 20.33 ఎకరాలకుగానూ 15.33 ఎకరాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని గోశాలకు చెందిన 96.36 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలోని 9.10, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 9.06 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఆయా స్థలాల్లో తొలిదశలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేసేలా దేవాదాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దేవాదాయశాఖకు కచ్చితమైన ఆదేశాలు?
వాస్తవానికి ఆలయ భూములపై పెత్తనం చెలాయించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఆలయ భూముల రక్షణకు మాత్రమే చర్యలు తీసుకోవాలి. దేవాదాయ శాఖ పరిధిలోని భూములను ఆ శాఖే చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా భూముల లీజ్ పూర్తవ్వాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ చర్యలపైనే హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేవాదాయశాఖ రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండటం వల్ల.. ఆలయ భూములపై ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నాయని మండిపడుతున్నాయి. ఆలయ భూములను అన్యాక్రాంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆలయ కమిటీలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని.. ఒప్పిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘‘ఎండోమెంట్ భూమి ప్రభుత్వ భూమి కాదు. ఆలయ భూములపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, థర్డ్ పార్టీలకు ఇవ్వాలన్నా, అమ్మాలన్నా ముందు హైకోర్టు అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. ఆలయ భూములపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. అది ఎండోమెంట్కు సాయపడాలి. అది కూడా బహిరంగ వేలం ద్వారానే ఆలయ భూములపై నిర్ణయం జరగాలి’’
- గతంలో ఓ కేసు సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు