హైదరాబాద్లో డీజేలు, ఫైర్క్రాకర్స్పై నిషేధం విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. శబ్ధ కాలుష్యం ఎక్కువై పోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్లో డీజేలు బ్యాన్
హైదరాబాద్, ఈవార్తలు : హైదరాబాద్లో డీజేలు, ఫైర్క్రాకర్స్పై నిషేధం విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. శబ్ధ కాలుష్యం ఎక్కువై పోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. డయల్ 100కు అధిక ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ పరిసరాల్లోని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, మతపెద్దలతో ఆయన సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయలు సేకరించారు. అనంతరం హైడరాబాద్లో డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్విప్మెంట్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, ఫైర్ క్రాకర్స్పై నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్ధంతో అనుమతి ఇస్తామని తెలిపారు. ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరం వరకు డీజేపై నిషేధం అమల్లో ఉంటుంది.
మతపరమైన ర్యాలీల్లో డీజేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని సీవీ ఆనంద్ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. సౌండ్ సిస్టంలను మాత్రమే పరిమితస్థాయిలో అనుమతిస్తామని చెప్పారు. సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పారు. నాలుగుజోన్లలో సౌండ్సిస్టంలో డెసిబుల్స్ను నిర్దేశించామని.. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబుల్స్కు మించరాదని, రాత్రివేళలో 45 డెసిబుల్స్కు మించి సౌండ్సిస్టమ్లో వాడకూడదని వివరించారు. మతపరమైన ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ కాల్చడం పూర్తిగా నిషేధమని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ చట్టం ప్రకారం ఐదు సంవత్సరాల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని, పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతి రోజు 5 వేల రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.