ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఈవార్తలు, హైదరాబాద్ న్యూస్: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అసలేం జరిగిందంటే.. సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్కుల కొడుకులు, లత్కోర్లు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై ఈసీ కేసీఆర్ వివరణ తీసుకుంది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్థి స్థాయిలో అర్థం చేసుకోలేదని కేసీఆర్ వివరణ ఇచ్చారు. అయితే, కేసీఆర్ వివరణపై సంతృప్తి చెందని ఈసీ.. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కేసీఆర్.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని భావిస్తూ, బుధవారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు (48 గంటల పాటు) ప్రచారం నిర్వహించకూడదని ఆదేశించింది.
ఈసీ చర్యలపై కేసీఆర్ స్పందన ఇదే..
కేసీఆర్ 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఈసీ ఆదేశించటంపై.. బీఆర్ఎస్ అధినేత స్పందించారు. ‘నా మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. స్థానిక మాండలికాన్ని తెలుసుకోలేకపోయారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని వాటిపై ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమలులో వైఫల్యాన్ని మాత్రమే ప్రస్తావించా. నా మాటలను కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారు’ అని తెలిపారు.