హైదరాబాద్లో ఫుట్పాత్ల షాపుల కూల్చివేతలపై కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానం నాగేందర్
హైదరాబాద్లో ఫుట్పాత్ల షాపుల కూల్చివేతలపై కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఆదర్శనగర్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఆయన.. కూల్చివేతల విషయంలో మాదాపూర్లో కుమారీ ఆంటీకి ఇచ్చిన మినహాయింపును పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని, ఈ తీరు ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. ప్రభుత్వ పాలసీ ఉంటే.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీశారు. అధికారుల వల్ల తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామని, అంత చిత్తశుద్ధి ఉంటే.. ఫుట్పాత్లపై ఆక్రమణల కూల్చివేతలను పాతబస్తీ నుంచి ప్రారంభించాలని సవాల్ విసిరారు.
చింతల్బస్తీలో రోప్ కింద రోడ్డు ఆక్రమించి చేపట్టిన వందకుపైగా నిర్మాణాలను ట్రాఫిక్ పోలీస్-జీహెచ్ఎంసీ సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టింది. అక్కడ ఇళ్లు కోల్పోయినవాళ్లంతా రోజువారీ చిరు వ్యాపారులే ఉన్నారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ. స్థానిక ఎమ్మెల్యే నోటీసులో లేకుండా కూల్చివేతలు ఎలా చేపడతారు? ఆపకపోతే ఇక్కడే బైఠాయిస్తా. ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు. జేసీబీకి అడ్డంగా కూర్చుంటా’ అని హెచ్చరించారు. ‘దావోస్లో ఉన్న సీఎం రేవంత్ వచ్చే వరకు అధికారులు ఆగాలి. ప్రజలకు నేను కదా సమాధానం చెప్పుకోవాల్సింది. కూల్చివేస్తే బాగుండదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోయారు. కూల్చివేతలను ఆపివేయలేదు.