తెలంగాణకు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా దావోస్ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర సీఎం అనుముల రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణకు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా దావోస్ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర సీఎం అనుముల రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు తీసుకురావడంపై శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎంకు పుష్పగుచ్చాలు అందజేశారు. కాగా, దాదాపు 16 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల వల్ల 49,550 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. సీఎం రేవంత్రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్బాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు దావోస్ పర్యటనకు వెళ్లారు. దాదాపు 4 రోజుల పర్యటనలో రేవంత్ బృందం బిజీగా గడిపింది. అనేక కంపెనీలతో చర్చలు జరిపి పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణ రైజింగ్ నినాదం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కలిసి వచ్చింది. దీంతో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపాయి.
- సన్ పెట్రో కెమికల్స్ సంస్థ భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు పెట్టనుంది. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు ఏర్పాటు చేయనుంది. 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. రూ. 45,500 కోట్ల పెట్టుబడులతో 7 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది.
- అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు రానున్నాయి. రూ.60,000 కోట్ల భారీ పెట్టుబడికి అమెజాన్ ముందుకు వచ్చింది
- కంట్రోల్ ఎస్ తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్ ఏర్పాటుచేయనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.10,000 కోట్ల పెట్టుబడితో 3,600 మందికి ఉపాధి దక్కనుంది.
- జేఎస్డబ్ల్యూ సంస్థ రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. రూ.800 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగాలు దక్కనున్నాయి.
- స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ కూడా తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
- మేఘా ఇంజినీరింగ్ మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు చేయనుంది. రూ.15000 కోట్ల పెట్టుబడులతో 5,250 మందికి ఉపాధి రానుంది.
- హెచ్సీఎల్ టెక్ సెంటర్ హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీంతో 5 వేల మందికి ఉపాధి కలుగనుంది. హైదరాబాద్లో విప్రో కంపెనీ విస్తరణ చేపట్టనుంది.