చేగుంట నుంచి దుబ్బాక మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు జాతీయ రహదారి నిర్మించేలా కేంద్రం చర్యలు తీసుకునేలా చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక హామీ ఇచ్చారు.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కొత్త మార్గాల్లో రహదారులు మంజూరు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులను కూడా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ మధ్య రహదారిని 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. త్వరలోనే ఆ పనులు ప్రారంభం అవుతాయి. ఇక.. మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా రహదారులు నిర్మించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, కొన్నింటిని కేంద్రం నిర్మిస్తోంది. అందులో భాగంగా.. చేగుంట నుంచి దుబ్బాక మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు జాతీయ రహదారి నిర్మించేలా కేంద్రం చర్యలు తీసుకునేలా చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో ప్రజల నుంచి ఉన్న ఈ డిమాండ్ నేపథ్యంలో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
వీలైనంత త్వరగా రోడ్డు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. గురువారం దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పలువురు ఈ విషయంపై ఎంపీకి వినతిపత్రం అందించారు. చేగుంట -సిరిసిల్ల మధ్య నేషనల్ హైవే చేపడితే వేములవాడకు ఈజీగా చేరుకోవచ్చని, వేములవాడ- హైదరాబాద్ మధ్య దూరం కూడా తగ్గుతుందని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రఘునందన్ రావు.. తప్పకుండా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నేషనల్ హైవే మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి చర్చిస్తానని తెలిపారు.