రాహుల్ గాంధీకి కేటీఆర్ భారీ బహిరంగ లేఖ.. మీకు అంత దమ్ముందా? అని సవాల్

అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం,అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

ktr

కేటీఆర్

హైదరాబాద్, ఈవార్తలు : అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం,అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు సమస్యలను లేవనెత్తిన ఆయన.. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా ఒక్కరంటే సమాజంలో అన్ని వర్గాలను నయనంచనకు గురిచేశారు. ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేశారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను హింసించే పులకేసి మాదిరిగా హింసిస్తుంటే ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఢిల్లీలో గప్ చుప్ అయిపోయారు. అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచే మీ నయవంచన స్వరూపం ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అంటూ ఊదరగొట్టిన మీరు మూడు వందల రోజులు దాటినా సరే వాటిని అమలు చేయటం చేతకాక చేతులేత్తేశారు. కాంగ్రెస్ కబంధ హస్తల్లో చిక్కుకొని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు విలవిల లాడుతోంది. అభయ హస్తం అని నమ్మబలికి భస్మాసుర హస్తంతో తెలంగాణ ప్రజలను నిండా ముంచారు. ఒక్కటా, రెండా ఈ ఏడాదిలో మీ పార్టీ పాలన వైఫల్యాలు చిత్ర గుప్తుడి చిట్టా అంతా ఉన్నాయి’ అని తెలిపారు.

‘నమ్మించి మోసం చేయటమనే నైజం కాంగ్రెస్ పార్టీ నరనరాల్లోనే ఉంది. ఆరు గ్యారంటీలు, అభయ హస్తం అంటూ ఇక్కడి ప్రజలను మోసం చేసేందుకు ముందుగా ఢిల్లీ నుంచి వచ్చి నాంది పలకింది మీరే. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ఆ తర్వాత మీ బాటలోనే ఇక్కడి నాయకులు నడుస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత నాది అని చెప్పిన మీరు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగి కూడా చూడలేదు. 3 వందల రోజులైనా ఒక పరిమిత ఉచిత బస్సు మినహా ఒక్క గ్యారంటీని అమలు చేయలేని అసమర్థత మీది. రైతులకు రుణమాఫీ అని చెప్పి సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదు. కానీ మీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో మాత్రం పూర్తి రుణమాఫీ చేసేశామంటూ సిగ్గులేకుండా అబద్ధాలను ప్రచారం చేసుకున్నారు. ఒక్క రుణమాఫీయే కాదు రైతు భరోసాను ఎత్తగొట్టారు. బోనస్ ను బోగస్ చేశారు. కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని దద్దమ్మల మాదిరిగా తయారయ్యారు. నమ్మి ఓటు వేసినందుకు ఒక్క వర్గం కాదు తెలంగాణలోని సబ్బండ వర్గాలను మోసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న మీ తీరును సమాజం గమనిస్తోంది’ అని వెల్లడించారు.

‘అన్ని వర్గాల సంక్షేమ మా బాధ్యత అంటూ ఎన్నికల కు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల సంక్షేమాన్ని నాశనం చేసే పనిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ సాధించింది ఏంటంటే సబ్బండ వర్గాలను రోడ్డెకించటమే. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, అంగన్ వాడీలు, పోలీసులు ఇలా అన్ని వర్గాల వాళ్లు ప్రతి రోజు రోడ్లపై ధర్నాలు, నిరసనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా పోలీసులను పోలీసులతోనే కొట్టించిన ఘనత మీకే దక్కుతుంది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయటమే క్షమించారని తప్పంటే.. అది చాలదన్నట్లుగా గెలిపించిన ప్రజలను హింసిస్తున్నారు. సాధారణంగా ప్రజల బాధలను తీర్చటం పాలకుల బాధ్యత. ప్రజలను బాధించటం ఎంత మాత్రం కాదు. కానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింసించే పులకేసి మాదిరిగా తయారయ్యాడు.  మూసీ, హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్నాడు. హైడ్రా, మూసీ పేరు చెబితినే ప్రజలు హడలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలకు గూడు కట్టిస్తామంటూ నమ్మబలికి వాళ్ల గూడును చెదరగొట్టిన గొప్ప పాలన మీ ప్రభుత్వానిది. పేద, మధ్య తరగతి ప్రజలను ఇళ్లను కూలగొడుతుంటే వాళ్ల చేసిన ఆర్తనాదాలు మీకెందుకు వినబడలేదు’ అని నిలదీశారు.

దమ్ముందా రాహుల్ గాంధీ?

తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తా అని బీరాలు పలికినా మీరు ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారు. స్వయంగా అశోక్ నగర్ కు వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నాది భరోసా అని చెప్పి ఆ నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు సిగ్గు అనిపించటం లేదా? మీ చేతగాని పాలన కారణంగా రాష్ట్రం ఆగమవుతోంది. మీ ఏడాది పాలనలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారు. ఇంకా నాలుగేళ్ల మీ చేతగాని పాలన కారణంగా తెలంగాణ ఏమైపోతుందనని ఆవేదన కలుగుతోంది. రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు మీ పాలన మొదలు కాగానే ఆత్మహత్యలు చేసుకోవటం మొదలు పెట్టారు. ప్రతి వర్గాన్ని రోడ్డెక్కించారు. కంపెనీలు తరలిపోతున్నాయి. రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోంది. పాలన అనుభవం లేని బ్లాక్ మెయిలింగ్ ముఖ్యమంత్రి కారణంగా తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో నిరసనలు కూడా చేసేందుకు వీలు లేకుండా నెల రోజుల పాటు ఆంక్షలు పెట్టే దుస్థితి మీ ప్రభుత్వానిది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం అంచనా వేయకుండా నేల విడిచి మీరు చేసిన సాము కారణంగా తెలంగాణ భవిష్యత్ తలకిందులుగా మారింది. తీరా చేయాల్సిన అన్యాయమంతా చేసి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జు ఖర్గే గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మించి హామీలు ఇస్తే ఆ రాష్ట్రం దివాళా తీస్తుందని స్వయంగా మీ పార్టీ అధ్యక్షుల వారే నొక్కి వక్కాలిస్తున్నారు’ అని గుర్తుచేశారు.

‘అధికారమే పరమావధిగా బొచ్చెడు హామీలు ఇచ్చిన పాపంలో మీరే ప్రధాన భాగస్వాములు. ఇప్పుడు అందుకు క్షమాపణలు చెబుతారా రాహుల్ గాంధీ గారు. దొరికిందే అవకాశమని మీ ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరి ట్యాక్స్ వాళ్లకు కట్టే పరిస్థితి తెచ్చారు. మీ ముఖ్యమంత్రి గారు బహిరంగంగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కుంభకోణాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇది చాలదన్నట్లుగా కొడితే ఏనుగు కుంభస్థలం అన్నట్లు మూసీ ప్రాజెక్ట్ తెరపైకి తెచ్చారు. రూ. లక్షా 50 వేల కోట్లతో చేపడుతామంటున్న ఈ ప్రాజెక్ట్ ఎవరి ప్రయోజనాల కోసమో? ఈ మొత్తం సొమ్ములో ఢిల్లీ వాటా ఎంత? పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు జేబులో వేసుకొని ఈ ప్రాజెక్ట్ కు మీ ఆమోదం లేకుండానే జరుగుతోందా? మీ మోసం, నయవంచన ఒక్క ప్రజలతోనే ఆగిపోలేదు. మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకుంటున్న తీరు చూస్తుంటే మీపై సానుభూతి కలుగుతోంది. పార్టీ ఫిరాయింపులు చేస్తే తక్షణమే వేటు పడేలా చట్టం అంటూ తెలంగాణలో ఫోజులు కొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంటే తోలుకుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయారు. రాజ్యాంగాన్ని కాపాడుతానంటూ రాజ్యాంగ ప్రతి పట్టుకొని తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతుంటే మౌన ముని అయిపోయారు. అదానీ విషయంలో మీ హిప్పోక్రసీ చూసిన తర్వాత నవ్వాలో, ఏడవాలో తెలియని దుస్థితి. ఓ వైపు మోడీ, అదానీని కలిపి మోదానీ అంటారు. మరోవైపు తెలంగాణలో దోస్తానా చేస్తారు. సిగ్గు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి. మొత్తంగా ఏడాది కూడా తిరగకముందే కాంగ్రెస్ నాయకులు రోడ్లపై తిరగలేని దుస్థితి తీసుకొచ్చారు. మా తెలంగాణ ఆగమయ్యేందుకు ప్రధాన కారణం మీరే. కనుక సూటిగా మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పండి. ఇచ్చిన హమీలు నెరవెర్చకుండా సబ్బండ వర్గాలను మోసం చేసిన మీరు, అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణాగా మార్చినందుకు యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి’ అని డిమాండ్ చేశారు.

కేటీఆర్ సంధించిన ప్రశ్నలివీ..

దమ్ముందా రాహుల్ గాంధీ మీకు.. అశోక్ నగర్ లో నిరుద్యోగుల దగ్గరకు వెళ్లేందుకు? 

దమ్ముందా రాహుల్ గాంధీ రైతుల దగ్గరకు వెళ్లేందుకు? 

దమ్ముందా రాహుల్ గాంధీ విద్యార్థుల దగ్గరకు వెళ్లేందుకు? 

దమ్ముందా రాహుల్ గాంధీ మీకు రక్షణ కల్పిస్తున్న పోలీసులా దగ్గరకు వెళ్లేందుకు? 

దమ్ముందా రాహుల్ గాంధీ మూసీ, హైడ్రా బాధితులను పరామర్శించేందుకు? 

దమ్ముందా రాహుల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల దగ్గరకు వెళ్లేందుకు?

దమ్ముందా రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్ల దగ్గరకు వెళ్లేందుకు? 

అసలు తెలంగాణ ప్రజల ముందు వచ్చే దమ్ముందా రాహుల్ గాంధీ మీకు?


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్