మెరుపు దాడులపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని.. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచానికి నష్టమేనని స్పష్టం చేశారు.
కేసీఆర్
హైదరాబాద్, ఈవార్తలు: పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై యావత్తు భారతావని గర్వపడుతోంది. అమాయక మహిళల పసుపు కుంకుమలను చెరిపేసినవారి అంతమే లక్ష్యంగా వైమానిక దాడులతో 9 చోట్ల క్షిపణుల వర్షం కురిపించింది. 9 ప్రాంతాల్లోని 21 చోట్ల దాడులు చేసింది. అయితే, ఈ మెరుపు దాడులపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని.. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచానికి నష్టమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను. ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా... ప్రపంచ మానవాళికి నష్టమే తప్ప లాభం చేకూర్చదని నా అభిప్రాయం. ఉగ్రవాదం అంతం కావాల్సిందే. ఈ విషయంలో పాజిటివ్గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి, సామరస్యాలు నెలకొంటాయి. భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
అటు.. మజ్లిద్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం పాక్పై భారత ఆర్మీ దాడులను స్వాగతించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని తెలిపారు. జై హింద్.. ఆపరేషన్ సింధూర్ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, భారత ఆర్మీ జరిపిన దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తోంది. మసూద్ అజహర్ కుటుంబం అంతా చనిపోయినట్లు పాక్ మీడియా చెప్తోంది.