విద్యుత్తు రంగంపై నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అంశంలో బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టు మెట్లెక్కారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఈవార్తలు : విద్యుత్తు రంగంపై నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అంశంలో బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టు మెట్లెక్కారు. విద్యుత్తు కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టివేయటంతో.. ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కమిషన్ పంపిన సమన్లపై హైకోర్టు ఈ నెల 1న తీర్పు ఇవ్వగా, దాన్ని ఆయన సవాల్ చేశారు. సోమవారం ఈ పిటిషన్ను సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
కాగా, వాస్తవానికి, విద్యుత్తు కొనుగోళ్ల అంశంపై నియమించిన కమిషన్.. పూర్తి సమాచారం సేకరించక ముందే మీడియా ముందుకు వచ్చిన జస్టిస్ నరసింహారెడ్డి.. ఆ అంశంపై మాట్లాడటాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. దాంతో ఆ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్ వేయగా, దాన్ని కొట్టివేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ నెల 1వ తేదీన నిర్ణయం తీసుకుంది. కేసును విచారణకు స్వీకరిస్తే జస్టిస్ నరసింహారెడ్డికి హైకోర్టు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే హైకోర్టు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.