ముఖ్యంగా పాతబస్తీలో కూడా అక్రమ నిర్మాణాలు న్నాయని హైడ్రా నిర్ధారించడంతో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సీరియస్ అయ్యారు. పేదల ఇండ్లను కూల్చేస్తే ఊరుకునేదే లేదని కాంగ్రెస్ సర్కారును హెచ్చరించిన ఒవైసీ.. తాజాగా మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, హైదరాబాద్: హైదరాబాద్ లోని చెరువులు, కుంటల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను రెండు నెలల నుంచి హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పేదల గుడిసెలతోపాటు మధ్యతరగతి ప్రజల ఇండ్లు, బడాబాబుల నిర్మాణాలు ఉన్నాయి. అయితే, వారికి తగినంత సమయం ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేతలకు దిగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలో కూడా అక్రమ నిర్మాణాలు న్నాయని హైడ్రా నిర్ధారించడంతో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సీరియస్ అయ్యారు. పేదల ఇండ్లను కూల్చేస్తే ఊరుకునేదే లేదని కాంగ్రెస్ సర్కారును హెచ్చరించిన ఒవైసీ.. తాజాగా మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు.
ఒవైసీ ఏమన్నారంటే?
ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ సుందరీకరణ ఆగదంటూ సీఎం రేవంత్ తాజాగా చేసిన కామెంట్స్ పై అసదుద్దీన్ స్పందించారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్లో నిర్వహించిన సభలో అసదుద్దీన్ పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా ఎఫ్ టీఎల్ పరిధిలోనే ఉన్నదని, మరి దాన్ని కూడా కూల్చేస్తారా? అని ప్రభుత్వానికి సవాల్ చేశారు. సెక్రటేరియెట్ తోపాటు నెక్లెస్ రోడ్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్, బాపూ ఘాట్, ప్రముఖుల షూట్స్ కూడా ఎఫ్ టీఎల్ లో ఉన్నాయని, వాటిపైకి కూడా బుల్డోజర్ పంపిస్తారా? అని నిలదీశారు. పేదల ఇండ్లను కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.అభివృద్ధికి తాను అడ్డుకాదని, కానీ.. పేదలను ఇబ్బందిపెడితే ఒప్పుకొనేది లేదని తేల్చి చెప్పారు. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందిలేకుండా చూడాలని, కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందనే విషయం మరవొద్దని రేవంత్ కు సూచించారు.