||సమీక్షలో సీఎం రేవంత్ తదితరులు||
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై ముఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని తెలిపారు.
ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని వెల్లడించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని వివరించారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజ నర్సింహ, సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు, కమిషనర్ కర్ణన్, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమలహాసన్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.