సాహితీ రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ను వరించింది. మానవ జీవితంలోని దుర్బలత్వంతోపాటు చారిత్రక విషాదాలను ఆమె.. తన రచనల్లో కళ్లకు కట్టారు
సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రికి నోబెల్ బహుమతి
సాహితీ రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ను వరించింది. మానవ జీవితంలోని దుర్బలత్వంతోపాటు చారిత్రక విషాదాలను ఆమె.. తన రచనల్లో కళ్లకు కట్టారని రాయల్ స్వీడిష్ అకాడమి ప్రకటించింది. వైద్య, భౌతిక, రసాయనశాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే వెల్లడించారు. ఇవాళ( గురువారం) సాహిత్యంలో విజేతను ప్రకటించగా.. శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి , అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు.
స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11లక్షల స్వీడిష్ క్రోనర్ (10లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.
53 ఏళ్ల హాన్ కాంగ్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన సుప్రసిద్ధ రచయిత్రి. ఆమె తండ్రి హాన్ సంగ్ ఒన్ నవలా రచయిత. సాహితీ కుటుంబంలో పుట్టిన హాన్ కాంగ్... యోన్సెల్ యూనివర్సిటీ నుంచి సాహిత్యంలో పట్టా అందుకున్నారు. అనేక రచనలతో కొరియా సాహితీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.