భారతీయ పౌరులు దేశం పట్ల మమకారాన్ని చంపుకుంటున్నారు. విదేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా భారతదేశాన్ని వదిలి విదేశాల్లో స్థిరపడేందుకు సిద్ధపడుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది భారతీయులు ఈ దేశ పౌరసత్వాన్ని వదిలి, విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తున్నారు. 2018 నుంచి 2023 వరకు 114 దేశాల్లో భారతీయులు పౌరసత్వాన్ని స్వీకరించారు.
విదేశాలకు భారతీయులు
భారతీయ పౌరులు దేశం పట్ల మమకారాన్ని చంపుకుంటున్నారు. విదేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా భారతదేశాన్ని వదిలి విదేశాల్లో స్థిరపడేందుకు సిద్ధపడుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది భారతీయులు ఈ దేశ పౌరసత్వాన్ని వదిలి, విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తున్నారు. 2018 నుంచి 2023 వరకు 114 దేశాల్లో భారతీయులు పౌరసత్వాన్ని స్వీకరించారు. వీరిలో అత్యధికలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీలో స్థిరపడ్డారు. గడిచిన ఆరేళ్లలో 70 మంది పాకిస్తాన్, 130 మంది నేపాల్, 1500 మంది కెన్యా పౌరసత్వాన్ని స్వీకరించారు. విదేశాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులు అధికంగా ఉంటున్నారు. 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం వివిధ దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో భారతదేశ పౌరసత్వాన్ని 8.34 లక్షల మంది వదులుకున్నారు. 2023లోనే విదేశీ పౌరసత్వాన్ని 2.16 లక్షల మంది స్వీకరించారు.
విదేశాల్లో మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పన్ను ప్రయోజనాలు వంటి కారణాలతో భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏకంగా 8.34 లక్షల మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌరులుగా మారారు. పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య కోవిడ్ కి ముందు సగటున 1.32 లక్షలుగా ఉంటే, ఆ తర్వాత 20 శాతం మేర పెరిగింది. ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళుతున్న భారతీయులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, ప్రశాంత జీవితం, నాణ్యమైన జీవన ప్రమాణాలు కోసం అక్కడే స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా భారత పాస్ పోర్ట్ తో చాలా దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల పాస్ పోర్టులతో ప్రపంచంలో చాలా దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయవచ్చనే భావన కూడా భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి వారిని ప్రేరేపిస్తోంది.
విదేశాల వైపు ముగ్గు చూపడానికి కారణాలు ఇవే..
భారతీయులు విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపడానికి అనేక కారణాలు ఉన్నాయి. విదేశాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు, అధిక జీతాలు లభించడం, ఆరోగ్య సంరక్షణ, అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉండడం, ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు కల్పిస్తుండడం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఆయా దేశాల అందిస్తుండడం, వ్యక్తిగత భద్రత, శాంతి భద్రతలు ఉండడం, అనుకూలమైన పన్ను విధానాలతోనే ఆయా దేశాలు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశాల్లో మాదిరిగా ద్వంద్వ పౌరసత్వం అనేది భారత రాజ్యాంగంలో లేదు. భారత పౌరసత్వం వదులుకున్న వ్యక్తులు ఇక్కడికి తిరిగి రావాలంటే ఖచ్చితంగావీసా ఉండాల్సిందే. బంధువులు, కుటుంబ సభ్యుల కోసం తరచూ భారత్ కు వచ్చి వెళ్లే వారి కోసం 2003లో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐవో) కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది పాస్ పోర్టు మాదిరి పదేళ్లపాటు పని చేస్తుంది. దీన్ని 2017 నుంచి నిలిపివేశారు. 2006 నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డును జీవితకాల పరిమితితో జారీ చేస్తున్నారు. ఇది ఉంటే వేశా లేకుండానే భారత్ కు వచ్చే వీలు ఉంటుంది. భారత్ లో ఉంటూనే ప్రైవేటు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ద్వంద్వ పౌరసత్వాన్ని అమలులోకి తెస్తే భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య తగ్గుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.