|| ప్రతీకాత్మక చిత్రం ||
ఈవార్తలు, నేషనల్ న్యూస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో ప్రజలకు బూస్టర్ డోస్ వేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పలువురు వైద్య నిపుణులు కూడా రెండో బూస్టర్ డోస్ వేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నందున ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ బూస్టర్ వేయాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వేరియంట్లను తట్టుకొనే హెర్డ్ ఇమ్యూనిటీ ప్రజల్లో ఉంది. కొత్త వేరియంట్ల ప్రభావం కూడా అంతంతగానే ఉంది. అందువల్ల ప్రస్తుతానికి ప్రజలకు రెండో బూస్టర్ వేయాల్సిన అవసరం లేదని కేంద్రం భావిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికైతే దేశంలో తొలి బూస్టర్ డోస్ డ్రైవ్ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపాయి. రెండో బూస్టర్పై కనీసం చర్చలు కూడా జరగలేదని స్పష్టం చేశాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో 1,51,186 టెస్టులు నిర్వహించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,582గా ఉంది. అటు.. నిన్న ఒక్క రోజే 46,450 మందికి వ్యాక్సిన్ వేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 2,201,123,642 డోసులు వేశారు. అటు.. చైనాలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఆ దేశంలో కరోనా బారిన పడి రోజుకు 9 వేల మంది చనిపోతున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కానీ, చైనా ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం అందించటం లేదు.