(Pic : ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి)
ఈవార్తలు, నేషనల్ న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరా బెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ హాస్పిటల్లో చికిత్స పొందారు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందేండ్లు పూర్తి చేసుకొన్నారు. హీరాబెన్ మరణ వార్త తెలిసిన వెంటనే గుజరాత్కు చేరుకొన్న ప్రధాని మోదీ.. స్వయంగా పాడె మోసి, సోదరులతో కలిసి చితికి నిప్పంటించారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా తల్లి మరణవార్తను వెల్లడించారు. ‘అమ్మ నూరేళ్ల జీవితం పూర్తి చేసుకుని దేవుడి వద్దకు చేరారు. ఆమెలో నేను త్రిమూర్తి అనుభూతిని పొందాను. తపస్విలాంటి జీవిత ప్రయాణం ఆమెది. విలువలకు కట్టుబడిన జీవితం నా తల్లిది’ అని హీరాబెన్ను గుర్తు చేసుకున్నారు.
హీరాబెన్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తదితరులు సంతాపం ప్రకటించి, ప్రధాని మోదీకి సానుభూతి తెలిపారు.