||ప్రతీకాత్మక చిత్రం||పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలం అవుతోంది.. తినడానికి తిండి లేదు.. మార్కెట్లో నిత్యావసర సరుకులు లేవు.. వంట నూనె, నెయ్యి లేదు.. ఉన్న కొన్ని వస్తువుల రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. పాల నుంచి ఉల్లిపాయల వరకు అన్నింటి రేట్లు భారీగా పెరిగాయి. మొత్తంగా ఆ దేశ పరిస్థితి దీనాతిదీనంగా తయారైంది. తిండి కోసం ప్రజలు కొట్టుకునే దుస్థితి వచ్చింది. ముఖ్యంగా ఖైబర్ ఫక్తుంఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గోధుమ పిండి కొరత నేపథ్యంలో ఆర్మీ సైనికులు ట్రక్కుల్లో పంచి పెట్టేందుకు వెళ్లగా.. ప్రజలు ఎగబడ్డారు. తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. అటు.. కరాచీలో పిండి ధర కిలోకు రూ.140, రూ.160 మధ్య నడుస్తోంది. ఇస్లామాబాద్లో 10 కిలోల బ్యాగ్కు రూ.1,500 పలుకుతోంది. బలూచిస్తాన్లో అయితే అసలు గోధుమ పిండి స్టాక్ మొత్తానికే లేకుండా పోయింది.
ఎందుకీ పరిస్థితి?
వాస్తవానికి కొన్నేళ్ల నుంచి పాక్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దానికి ఆజ్యం పోసినట్లు గత ఏడాది వరదలు సంభవించాయి. ఈ వరదలకు 90 శాతం ప్రజలు ప్రభావితమయ్యారు. పంటలు నేలరాలాయి. దీంతో, నిత్యావసరాల రేట్లు పెరుగుతూ పోయాయి. మరోవైపు ద్రవ్యోల్బణం ఆ దేశాన్ని దెబ్బ తీసింది. ఎగుమతులు తగ్గి దిగమతులు పెరిగాయి. దాని ప్రభావం విదేశీ మారక నిల్వలపై పడింది. అవి అడుగంటిపోయాయి. ముఖ్యంగా రాజకీయ అస్థిరత కూడా పాకిస్తాన్ను చావు దెబ్బ తీసింది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి శ్రీలంకలా మారిపోతోంది.