మళ్లీ లొల్లి పెడుతున్న ఉల్లి.. ఘాటెక్కిన ఉల్లిగడ్డ ధరలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

(రంగారెడ్డి, ఈవార్తలు, అక్కినేపల్లి పురుషోత్తంరావు)
ఉల్లిగడ్డ ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. మళ్లీ ఈ సంవత్సరం ధరలు పెరిగి ఉల్లిగడ్డ ధర ఘాటు అధికం అయింది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఉల్లిగడ్డలు కొనడానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది. గత రెండు నెలల నుండి ఉల్లిగడ్డ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఉల్లిగడ్డ ధరలు పెరగడం వల్ల వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలను ప్రజలు కూల్చివేసిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది నెలల క్రితం ఉల్లిగడ్డలు ఆకాశాన్ని అంటడంతో అందరూ ఇబ్బంది పడ్డారు. తర్వాత సాధారణ స్థాయికి చేరుకోగా, మళ్లీ ఉల్లిగడ్డల ధరలు తెలంగాణలో ధరలు పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్‌లోనూ ధరలు మండిపోతున్నాయి.
కిలో తెల్ల ఉల్లిగడ్డ 80 రూపాయలు.. ఎర్ర ఉల్లిగడ్డ 60 రూపాయలు
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా ఉంది హోల్ సేల్ లో తెల్ల ఉల్లిగడ్డ కిలో 80 రూపాయలుగా ఉంది. రిటైల్‌గా 85 రూపాయల నుండి 90 రూపాయల వరకు అమ్ముతున్నారు. మార్కెట్లో హోల్‌సేల్ ఎర్ర ఉల్లిగడ్డ ధర కిలోకు 60 రూపాయలుగా ఉన్నది. రిటైల్‌గా 65 రూపాయలుగా ఉంది. ఈ  ధరలను చూసి కొనాలంటే భయపడుతున్నారు సామాన్య జనం. ఇప్పటికే నిత్యవసర వస్తువులు ధరలు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేరే రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డను దిగుమతి చేసుకొని, ఉల్లిగడ్డ రేటును నియంత్రణలో ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు.
ప్రతికూల పరిస్థితులే కారణమా?
ఖరీఫ్ సీజన్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లిగడ్డ సాగు ఆలస్యమైందని దీనితో పంట ఆలస్యంగా చేతికి వచ్చిందని వినియోగ వ్యవహార మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో అధికంగా ఉల్లిగడ్డలు సాగు చేస్తారు. ఈ సంవత్సరం ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఉల్లిగడ్డ సాగు చాలా తక్కువగా చేశారు. దీనికి తోడు దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చింది. ఖరీఫ్ పంట ఇప్పటికే మార్కెట్ కు చేరాల్సి ఉండగా ఇంకా రాలేదు. మరోవైపు నిల్వలు కూడా ఖాళీ అవుతున్నాయి. ఫలితంగా ధరలు పెరిగాయి.



వెబ్ స్టోరీస్