ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి వంద రోజులు పూర్తయింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఐటీరంగం కాస్త వెనుకబడి ఉంది. ఈ రంగాన్ని మిగిలిన రాష్ట్రాలతోపాటు పరుగులు పెట్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఐటీ రంగాల ద్వారా ఐదేళ్లలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి వంద రోజులు పూర్తయింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఐటీరంగం కాస్త వెనుకబడి ఉంది. ఈ రంగాన్ని మిగిలిన రాష్ట్రాలతోపాటు పరుగులు పెట్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఐటీ రంగాల ద్వారా ఐదేళ్లలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఐటి ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటి ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఈఎస్డిఎం), సెమీ కండక్టర్, డేటా సెంటర్, స్టార్ట్ అప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీలను రూపొందిస్తోంది. వీటితోపాటు భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉన్న కృత్రిమ మేధ (ఏఐ), డ్రోన్ పాలసీలను కొత్తగా తీసుకురాబోతోంది. వీటికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు పూర్తయింది. నూతన పారిశ్రామిక విధానంతోపాటు వీటిని కూడా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 2021-24 ఐటి పాలసీ మార్చి నెలతో ముగిసింది.
సాధ్యమైనంత త్వరగా కొత్త ఐటి విధానాన్ని ప్రకటించడం ద్వారా ఆ రంగంలోని సంస్థలను ఆకర్షించాలని ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పెట్టుబడుల ఆధారంగా కాకుండా సంస్థ కల్పించిన ఉపాధి లెక్కల ఆధారంగా ప్రోత్సహకాలను అందించేలా నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం. రాబోయే ఐదేళ్లపాటు అమలులో ఉండేలా కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకురానుంది. డిమాండ్ కు అనుగుణంగా కొత్త ఐటి పార్కులను అభివృద్ధి చేయాలని తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలోని మిలీనియం టవర్స్ లో అందుబాటులో ఉన్న మూడు లక్షల చదరపు అడుగులు స్థలంలో 1,92,563 చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. దీన్ని కొత్త కంపెనీలను ఏర్పాటు చేసేందుకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడ ఏసి అర్బన్ ఐటి పార్కులో మరో 58,569 చదరపు అడుగుల స్థలం కంపెనీలకు కేటాయించేందుకు అందుబాటులో ఉంది. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 12.87 ఎకరాలను పరిశ్రమలకు కేటాయించే వెసులుబాటు ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఎకరా రూ.81 లక్షలకు కేటాయించాలని ప్రతిపాదిస్తోంది. ఇక్కడే మరో 72.4 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ డిక్షన్ టెక్నాలజీస్, వింగ్ టెక్, టిసిఎల్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొప్పర్తిలో 2007.52 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. డిక్షన్ టెక్నాలజీస్, రిజల్యూట్, టెక్నోడోమ్, వర్చువల్ మేజ్ వంటి సంస్థలకు భూములను కేటాయించారు. వీటన్నింటి సహకారంతో ఐటీ రంగంలో మరిన్ని ఉద్యోగాలను కల్పించేలా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో కనీసం ఐదు లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలను కల్పించడం లక్ష్యంగా ప్రత్యేకంగా విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనివల్ల నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.