దాదాపు 14 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. రాజ్యసభలోనూ 12 గంటలకు పైగా చర్చ జరిగింది. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చ అనంతరం చేపట్టిన ఓటింగ్లో బిల్లు ఆమోదం పొందింది.
న్యూఢిల్లీ: దాదాపు 14 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. రాజ్యసభలోనూ 12 గంటలకు పైగా చర్చ జరిగింది. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చ అనంతరం చేపట్టిన ఓటింగ్లో బిల్లు ఆమోదం పొందింది. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంపై దాడి జరిగిందని అన్నారు. గురువారం రాజ్యసభలోకి వచ్చే ముందు మీడియాతో మాట్లాడిన ఆమె.. సమాజంలో శాశ్వత విభజనను తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే వక్ఫ్ బిల్లును ఆమోదించిందని, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకే సభలోకి తీసుకొస్తున్నారని విమర్శించారు. మోదీ నిర్ణయాలతో దేశం అగాధంలోకి వెళ్తోందని వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తరచూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అయితే, ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దీటుగా బదులిచ్చారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలను మోదీ సర్కారు సరిచేస్తోందని, అందులో భాగంగానే వక్ఫ్ సవరణల బిల్లును తీసుకొచ్చామని పేర్కొన్నారు.
కాగా, బుధవారం లోక్సభలో వక్ఫ్ సవరణల బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేయగా, 232 మంది ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణల బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనుంది. ఇదిలా ఉండగా, వక్ఫ్ సవరణ బిల్లుపై బీజూ జనతాదళ్ (బీజేడీ) వెనక్కి తగ్గింది. గతంలో వక్ఫ్ బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలని తన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చిన పార్టీ.. రాజ్యసభలో తమ సభ్యులు మనస్సాక్షి మేరకు ఓటు వేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పార్టీకి లోక్సభలో సభ్యులు లేరు. కానీ రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. వీరంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని గతంలో బీజేడీ వెల్లడించింది. అయితే నవీన్ పట్నాయక్ ఆదేశాలతో.. పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తన ఎంపీలకు ఎలాంటి విప్ జారీ చేయడం లేదని పార్టీ పేర్కొంది. మరోవైపు, వక్ఫ్ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు తెలపడంతో.. ఇద్దరు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. జేడీయూ ముస్లింల విశ్వాసాన్ని కోల్పోయిందని మహమ్మద్ ఖాసీ అన్సారీ, మహమ్మద్ నవాజ్ మాలిక్.. సీఎం నితీశ్ కుమార్కు వేర్వేరుగా రాజీనామా లేఖలు పంపారు.
రాజ్యసభలో ఓటింగ్ జరిగిందిలా..
బిల్లుకు అనుకూలంగా: 116
బిల్లుకు వ్యతిరేకంగా: 74