తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో నడుస్తున్న కేసుపై అసెంబ్లీలో ఎలా మాట్లాడుతారని నిలదీసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..
సీఎం రేవంత్పై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, ఈవార్తలు : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో నడుస్తున్న కేసుపై అసెంబ్లీలో ఎలా మాట్లాడుతారని నిలదీసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదని, ఉప ఎన్నికలు రావని అన్నారు. ఈ వ్యాఖ్యలను పిటిషనర్ తరఫు న్యాయవాది సుందరం జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కోర్టులో నడుస్తున్న కేసుపై అలా ఎలా అసెంబ్లీలో మాట్లాడుతారు? ఉప ఎన్నికలు రావని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. ఇంతకు ముందు కూడా ఇలాగే న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడారని.. మళ్లీ మళ్లీ అలాగే రిపీట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘మేం అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తున్నాం. మాకు అధికారాలు లేవని కాదు. అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడే మాటలను కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి’ అని స్పష్టం చేశారు.
ఇక, పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కోర్టు.. స్పీకర్ ఇంకో నాలుగేళ్లు ఏం నిర్ణయం తీసుకోకుండా ఉంటే న్యాయస్థానాలు చేతులు కట్టుకొని కూర్చోవాలా? అని ప్రశ్నించింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్ను విచారణకు పిలిచిన విషయాన్ని మర్చిపోవద్దని మొట్టికాయలు వేసింది.