తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి షాకుల మీద షాకులు తాకుతున్నాయి. సుప్రీం కోర్టు వేసే మొట్టికాయలకు ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అసెంబ్లీలో ఫిరాయింపులపై రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు.. కంచ గచ్చిబౌలి భూములపైనా మొట్టికాయలు వేసింది.
సుప్రీం కోర్టు Photo: Google
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి షాకుల మీద షాకులు తాకుతున్నాయి. సుప్రీం కోర్టు వేసే మొట్టికాయలకు ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అసెంబ్లీలో ఫిరాయింపులపై రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు.. కంచ గచ్చిబౌలి భూములపైనా మొట్టికాయలు వేసింది. వివరాల్లోకెళితే.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అన్ని చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఉదయమే విచారణ చేపట్టిన సుప్రీం జస్టిస్ గవాయ్ ధర్మాసనం.. కంచ గచ్చిబౌలి భూములను సందర్శించి, మధ్యా్హ్నంలోగా మధ్యంతర నివేదికను పంపాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. మళ్లీ మధ్యాహ్నం 3:45 గంటలకు విచారణ చేపట్టిన కోర్టు.. మధ్యంతర నివేదికను పరిశీలించి చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీసింది.
దాదాపు 100 ఎకరాల్లో భూమి చదును చేసినట్లు నివేదికలో గుర్తించి.. ఇది చాలా తీవ్రమైన అంశమని తెలిపింది. మరోవైపు, భూముల వ్యవహారానికి సంబంధించిన వార్తా కథనాలనను అమికస్ క్యూరీ.. ధర్మాసనం ముందు ఉంచింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చుతున్నట్లు వెల్లడించింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని సీఎస్ను ప్రశ్నించింది. ‘ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా? ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదు. మా ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలి’ అని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, ఇదే అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. దీంతో.. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని జస్టిస్ బీర్ గవాయ్ స్పష్టం చేశారు. అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.
హైకోర్టులోనూ విచారణ
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులోనూ గురువారం విచారణ జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరడంతో.. విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని.. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హెచ్సీయూలో విద్యార్థుల సంబురాలు
సుప్రీం కోర్టు ఆదేశాలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా కలిసి వర్సిటీలో సంబురాలు చేసుకున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ దుందుడుకు చర్యలు విరమించుకోవాలని అన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకొనేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
భూముల వివాదంపై రాష్ట్ర సర్కారు కమిటీ
కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మంత్రుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా కమిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది.
సుప్రీం ఆదేశాలను పాటిస్తాం
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పాటిస్తాం. సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉంది.. న్యాయం గెలుస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తాం
- మంత్రి శ్రీధర్ బాబు
హెచ్సీయూ విద్యార్థుల విజయమిది
కంచ గచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు హర్షణీయం. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విజయం. విద్యార్థుల నిస్వార్థ నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లే ఈ సానుకూల తీర్పు వచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం మద్దతు ఇచ్చిన ఉద్యమకారులు, సెలబ్రిటీలు, పర్యావరణ ప్రేమికులు, మీడియా, సోషల్ మీడియాకు విద్యార్థుల తరఫున ధన్యవాదాలు.
- కేటీఆర్