తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలి HCU భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది.
సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, ఈవార్తలు: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలి HCU భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది. హెచ్సీయూ భూముల వ్యవహారంపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు కీలక సూచనలు చేసింది. కంచె గచ్చిబౌలి భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు.. ఈ వ్యవహారంపై మధ్యాహ్నం 3.45 నిమిషాలకు మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది.
కాగా, హెచ్సీయూ భూముల వ్యవహారంపై దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినీ సెలబ్రిటీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్థులు కూడా హెచ్సీయూ విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. భూముల చదునును వెంటనే ఆపకపోతే దేశంలోని అన్ని యూనివర్సిటీలను కలుపుకొని ఆందోళనలను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. అయితే, బుధవారం జరిగిన ఆందోళనల్లో పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జీ ప్రయోగించారు.