హిందూ వివాహం అనేది సప్తపది (అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచే ప్రక్రియ)తో ముడిపడి ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ‘హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హిందూ పెళ్లిని నమోదు చేయటం వల్ల వివాహానికి రుజువు లభిస్తుంది. కానీ, చట్టంలోని సెక్షన్-7 ప్రకారమే పెళ్లి జరగాలి. అంటే వివాహ వేడుకలో సప్తపది నిర్వహించాలి.
ఈవార్తలు, న్యూఢిల్లీ: ఈ మధ్య పెళ్లిళ్లు అనగానే బ్యాండ్ బాజాలు, సంగీత్లు, హల్దీ ఫంక్షన్లు, రిసెప్షన్లు, ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు, భరాత్లే. కానీ, పెళ్లి అంటే అంతకుమించి అని చెప్తోంది సుప్రీం కోర్టు. తాళి కడితేనో, జిలకర్ర బెల్లం నెత్తిపైన పెడితేనో పెళ్లి అయినట్టు కాదు.. అగ్ని చుట్టూ ఏడడుగులు నడవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ‘హిందూ మ్యారేజ్ అంటే ఆటలు, పాటలు కాదు.. విందు వినోదాలు అసలే కాదు.. అదొక పవిత్ర మత ప్రక్రియ’ అని తెలిపింది. హిందూ వివాహం అనేది సప్తపది (అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచే ప్రక్రియ)తో ముడిపడి ఉంటుందని వెల్లడించింది. ‘హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హిందూ పెళ్లిని నమోదు చేయటం వల్ల వివాహానికి రుజువు లభిస్తుంది. కానీ, చట్టంలోని సెక్షన్-7 ప్రకారమే పెళ్లి జరగాలి. అంటే వివాహ వేడుకలో సప్తపది నిర్వహించాలి. అలాకాకుంటే ఆ వివాహానికి చట్టబద్ధత లభించదు’ అని జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు హిందువుల పెళ్లిళ్ల ప్రాముఖ్యత, చట్టబద్ధతను తెలియజేసింది.
హిందూ వివాహం ఒక సంస్కారమైన మతకర్మ అని, ఇది భారతీయ సమాజంలో గొప్ప విలువ కలిగిన సంస్థ అని, అది దాని హోదాను పొందవలసి ఉంటుందని ధర్మాసనం వివరించింది. అత్యంత వైభవోపేతంగా పెండ్లి నిర్వహించినా, చట్టం దృష్టిలో నిబంధనలే ప్రామాణికమని, పరస్పర గౌరవం, భార్యాభర్తల మధ్య బంధం హిందూ వివాహ పవిత్ర లక్షణమని తెలిపింది. అందుకే వేడుక సముచిత మర్యాదలతో నిర్వహించాలని, పెండ్లి చేసుకొనే వధువు, వరుడు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు వివాహ తంతును లోతుగా తెలుసుకోవాలని సూచించింది. పెళ్లి అనేది పాటలు, డ్యాన్స్, విందు, కట్నాలు, కానుకల కోసం చేసే ప్రక్రియ కాదని, వాణిజ్యపరమైన లావాదేవీ అసలే కాదని స్పష్టం చేసింది.