శీతాకాల పార్లమెంట్ సమావేశాల తేదీలను కేంద్రం ప్రకటించింది. నవంబర్ 25వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం వెల్లడించారు.
భారత పార్లమెంట్ భవనం Photo: Facebook
న్యూఢిల్లీ, ఈవార్తలు : శీతాకాల పార్లమెంట్ సమావేశాల తేదీలను కేంద్రం ప్రకటించింది. నవంబర్ 25వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం వెల్లడించారు. నవంబర్ 25న ప్రారంభమయ్యే సమావేశాలు.. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయని వివరించారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
ఈ శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టంచేశారు. అయితే, ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
మరోవైపు.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబర్ 26వ తేదీకి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. అదే రోజు పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ్యులంతా కలిసి న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఆ హాల్లోనే ప్రస్తుత ఉభయ సభల సభ్యులు సమావేశం అవుతారు.