కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సంచలన అడుగులు వేస్తున్నది. దేశంలోని ప్రజలందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సంచలన అడుగులు వేస్తున్నది. దేశంలోని ప్రజలందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికోసం బీమా చట్టం, 1938ని సవరించనున్నట్లు సమాచారం. దీనిపై ఓ బిల్లును రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 2047 నాటికి దేశ ప్రజలందరికీ బీమా కల్పించాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని సవరించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పాలసీదారుల ప్రయోజనాలతోపాటు సులువుగా వ్యాపారం చేయడానికి వీలుగా బీమా చట్టంలో ఈ సవరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాంపోజిట్ లైసెన్స్, సాల్వెన్సీ నిబంధనల తగ్గింపు, క్యాప్టివ్ లైసెన్స్ జారీ, ఇంటర్మీడియరీలకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్, ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ పంపిణీకి ఇన్సూరర్లకు అనుమతి ఇవ్వటం వంటి నిబంధనలు ఈ బిల్లులో ఉండనున్నాయి. ఈ నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగంలాగే బీమా రంగంలోకి ప్రత్యేకంగా బీమా కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత వర్గీకరణ ప్రకారం, యూనివర్సల్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్ ఉన్నాయి. కాంపోజిట్ లైసెన్స్ ఇస్తే లైఫ్ ఇన్సూరర్లు జీవిత బీమా లేదా సాధారణ బీమా పాలసీలను మూల్యాంకనం చేసి, ప్రీమియం రేట్లను నిర్ణయించడానికి వీలవుతుంది. 1938నాటి చట్టం ప్రకారం లైఫ్ ఇన్సూరర్లు జీవిత బీమాను, జనరల్ ఇన్సూరర్లు కేవలం ఆరోగ్య, మోటర్, అగ్ని ప్రమాద, మెరైన్ వంటి నాన్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇవ్వడానికి వీలవుతోంది.
అంటే ఓ ఇన్సూరెన్స్ కంపెనీ జీవిత బీమా ప్రొడక్ట్లను, నాన్ లైఫ్ బీమా ప్రొడక్ట్లను ఏకమొత్తంగా ఇవ్వడానికి సాధ్యం కాదు. ఈ పరిస్థితిని తొలగించి దేశ ప్రజలందరికీ బీమాను అందజేయాలనే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. దీని తుది ముసాయిదా సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే ఈ ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపి.. ఆమోదించనున్నారు. అనంతరం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.