ఇండియాలో 2020లో నమోదైన కరోనా మరణాల్లో 11.9 లక్షల మరణాలు అధికంగా చనిపోయారని తాజాగా ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ఇండియాలో 2020లో నమోదైన కరోనా మరణాల్లో 11.9 లక్షల మరణాలు అధికంగా చనిపోయారని తాజాగా ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. అధికారిక లెక్కల కన్నా మరణాల సంఖ్య 8 రెట్లు అధికం అని స్పష్టం చేసింది. కొవిడ్ వచ్చిన తొలి ఏడాదిలో దళితులు, ఆదివాసీలు, ముస్లింలలో ఎక్కువ శాతం చనిపోయారని వివరించింది. మరీ ముఖ్యంగా పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా మరణించారని తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సోసియాలజిస్ట్, న్యూయార్క్ సిటీ యూనివర్సిటీకి చెందిన ఎకనామిస్ట్ నేతృత్వంలోని పరిశోధనా బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. వయసు, లింగం, సామాజిక వ్యత్యాసం అంశాల వారీగా కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందన్నదానిపై ఈ అధ్యయనం నిర్వహించగా.. మహిళలు, అణగారిన వర్గాలవారి ఆయుర్దాయం ఎక్కువగా తగ్గిందని తేలింది. సామాజిక వర్గాలవారీగా చూస్తే ముస్లింలలో జీవిత కాలం భారీగా తగ్గింది. వారి ఆయుర్దాయం 5.4 ఏళ్లు తగ్గగా, ఎస్టీల్లో 4.1 ఏండ్లు, ఎస్సీల్లో 2.7 ఏళ్ల ఆయుర్దాయం తగ్గింది. హిందువుల్లోని ఓసీ, బీసీల జీవిత కాలం 1.3 ఏళ్లు మాత్రమే తగ్గింది. ఇలాంటి వ్యత్యాసాలు ఇండియాలో తప్ప వేరే ఏ దేశంలోనూ లేవని సర్వే తెలిపింది. ఇక, మహిళల్లో 17 శాతం మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది.
కాగా, సర్వేపై నీతి ఆయోగ్ అభ్యంతరం తెలిపింది. నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పౌల్ మీడియాతో మాట్లాడుతూ సర్వే నిర్వహణలో చాలా తప్పులు ఉన్నాయని అన్నారు. దాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. సర్వే మెథడాలజీ సరిగా లేదని, దానివల్లే తప్పుడు అంచనాలు రూపొందించారని వెల్లడించారు. కరోనా సమయంలో ఇండియాలో 99 శాతం మరణాలు రిజిస్టర్ అయ్యాయని పేర్కొన్నారు.