భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్రానికి ప్రతిపాదించారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా (ఇన్సెట్లో ప్రస్తుత సీజేఐ చంద్రచూడ్)
న్యూఢిల్లీ, ఈవార్తలు : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ మేరకు తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లయితే సుప్రీంకోర్టు 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా నియమితులవుతారు. నిబంధనల ప్రకారం.. ఈ ప్రతిపాదనను లేఖ రూపంలో ప్రస్తుత సీజేఐ కేంద్ర న్యాయశాఖకు పంపిస్తారు.
ఆ లేఖను కేంద్ర న్యాయ శాఖ.. దేశ ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపిస్తుంది. ఆయన ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి ఆమోదంతో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను చేపడతారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వా త ఆ పదవిని చేపట్టడానికి ముందు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. అందులో భాగంగానే చంద్రచూడ్.. తర్వాతి సీజేఐగా సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదించారు.