ఏ థియేటర్కు వెళ్లినా.. సినిమా మొదలు కావటానికి పది, పదిహేను నిమిషాల ముందు యాడ్స్తో ఇబ్బంది పెడతాయి థియేటర్ యాజమాన్యాలు. పెద్ద పెద్ద థియేటర్లు అయితే వరుసగా యాడ్స్ వేసి విసిగిస్తాయి. సినిమా ఇంకెప్పుడు వేస్తారు అన్నట్లు కోపం తెప్పిస్తారు.
ప్రతీకాత్మక చిత్రం
ఏ థియేటర్కు వెళ్లినా.. సినిమా మొదలు కావటానికి పది, పదిహేను నిమిషాల ముందు యాడ్స్తో ఇబ్బంది పెడతాయి థియేటర్ యాజమాన్యాలు. పెద్ద పెద్ద థియేటర్లు అయితే వరుసగా యాడ్స్ వేసి విసిగిస్తాయి. సినిమా ఇంకెప్పుడు వేస్తారు అన్నట్లు కోపం తెప్పిస్తారు. అలా కోపం తెప్పించిన ఓ బడా థియేటర్కు వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది. వివరాల్లోకెళితే. బెంగళూరుకు చెందిన అభిషేక్ (30) 2023 డిసెంబర్లో ఓ సినిమాకు వెళ్లాడు. ఆ సినిమా సాయంత్రం 4.05 గంటలకు ప్రారంభమై, 6.30 గంటలకు పూర్తి కావాల్సి ఉంది. అయితే, సినిమా ప్రారంభానికి ముందు 25 నిమిషాల పాటు యాడ్స్ను ప్రదర్శించారు. సినిమా 4.30 గంటలకు ప్రారంభించారు. దాంతో సినిమా లేట్గా పూర్తయ్యింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ప్రేక్షకుడు.. సినిమా ఆలస్యంగా స్ట్రీమింగ్ కావడం వల్ల తన అపాయింట్మెంట్ షెడ్యూల్ మిస్ అయినట్లు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇతరుల సమయాన్ని వృథా చేసి లబ్ధి పొందే హక్కు ఎవరికీ లేదని.. సమయం డబ్బుతో సమానమని పేర్కొంటూ ఫిర్యాదుదారుడికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.20 వేలు చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చులకు రూ.10 వేలు ఇవ్వాలని పీవీఆర్-ఐనాక్స్ను కోర్టు ఆదేశించింది. తప్పుడు వ్యాపార విధానాలు అనుసరిస్తున్నందుకు అదనంగా రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. పబ్లిక్ సర్వీస్ యాడ్స్ అని థియేటర్ యాజమాన్యం చెప్పగా.. సినిమా స్క్రీనింగ్కు 10 నిమిషాల ముందు ప్రదర్శించాలని కోర్టు తేల్చి చెప్పింది. ఆదేశాలు జారీ చేసిన 30 రోజుల లోపు రూ.లక్ష కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.