భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ60 PSLC-c60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక.. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
స్పేడెక్స్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట, డిసెంబర్ 30 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ60 PSLC-c60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక.. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయనున్నారు. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్ చేయించడం ప్రధాన లక్ష్యం.
నాలుగో దేశంగా భారత్
భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో పేర్కొంది. ఈ డాకింగ్ ప్రక్రియ విజయవంతం అయితే ఈ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.
జనవరి 7న డాకింగ్ జరిగే అవకాశం: సోమనాథ్
పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను అభినందించారు. వాహక నౌక 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. స్పేడెక్స్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టడం మిషన్లో తొలి భాగమని చెప్పారు. డాకింగ్ ప్రక్రియకు మరో వారం సమయం పడుతుందని, జనవరి 7న డాకింగ్ జరిగే అవకాశం ఉందని సోమనాథ్ తెలిపారు.