కెనడాతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో షెడ్యూల్ ప్రకారం గురువారం నిర్వహించాల్సిన కాన్సులర్ క్యాంప్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం
ఈవార్తలు, న్యూఢిల్లీ : కెనడాతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో షెడ్యూల్ ప్రకారం గురువారం నిర్వహించాల్సిన కాన్సులర్ క్యాంప్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది. ‘కమ్యూనిటీ క్యాంప్ నిర్వహణకు రక్షణ కల్పించడంతో భద్రత సంస్థలు విఫలం అయ్యాయి. దానివల్ల గతంతో ప్రకటించిన కొన్ని క్యాంపులను రద్దు చేశాం. తాజా క్యాంప్ను కూడా అదే కారణంతో రద్దు చేస్తున్నాం. సభ్యుల రక్షణ కోసం ఈ కార్యక్రమాలను రద్దు చేయాల్సి వచ్చింది’ అని స్పష్టం చేసింది.
ఖలిస్తానీ నేత నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్లు, ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రదాని ట్రూడో ఆరోపించటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. మరోవైపు, ఇటీవల బ్రాంప్టన్లోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీ వేర్పాటువాదులు దాడికి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడి భక్తులపై దాడి చేశారు. ఆ దాడిని నిరసిస్తూ హిందూవాదులు నిరసన చేపడితే.. వారిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. దీంతో కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆలయంపై దాడి ఘటనను ఖండించారు. వరుస ఉద్రిక్తతల నేపథ్యంలోనే కాన్సులర్ క్యాంప్లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.