||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కాసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. న్యూఢిల్లీలోని ఆకాశవాణి రంగ్భవన్ ఆడిటోరియంలో మాట్లాడిన ఆయన.. పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 80 ఏళ్లు నిండిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో 6 లక్షల ఓట్లను తొలగించామని, కొత్తగా 17 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని వివరించారు. రాజస్థాన్, మిజోరం దేశ సరిహద్దు రాష్ట్రాలైనందున ఆ రాష్ట్రాల్లో 940 చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక.. తెలంగాణలో నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అయ్యింది. ఇటీవలే తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. పార్టీలు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యి ఎన్నిక నిర్వహణపై చర్చించి, ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.
తెలంగాణ
నోటిఫికేషన్ : నవంబర్ 3,
నామినేషన్లు : నవంబర్ 10 వరకు
పరిశీలన : నవంబర్ 13
ఉపసంహరణ : నవంబర్ 15
పోలింగ్ : నవంబర్ 30
ఫలితాలు : డిసెంబర్ 3
మధ్యప్రదేశ్
పోలింగ్ : నవంబర్ 7
ఛత్తీస్గఢ్
పోలింగ్ : నవంబర్ 7, నవంబర్ 17 (రెండు దశలు)
రాజస్థాన్
పోలింగ్ : నవంబర్ 23
మిజోరం
పోలింగ్ : నవంబర్ 7