రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత పెంచాలి.? ఎక్కడ తగ్గించాలి.? అనే అంశాలపై పూర్తి నివేదిక జనవరి 15వ తేదీ నాటికి ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోరుకుంటుందని చెప్పిన మంత్రి.. రాష్ట్రానికి రెవెన్యూ కూడా అవసరమని వెల్లడించారు.
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత పెంచాలి.? ఎక్కడ తగ్గించాలి.? అనే అంశాలపై పూర్తి నివేదిక జనవరి 15వ తేదీ నాటికి ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోరుకుంటుందని చెప్పిన మంత్రి.. రాష్ట్రానికి రెవెన్యూ కూడా అవసరమని వెల్లడించారు. అందువల్లే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. గ్రోత్ కారిడార్లు, భూమి రేట్లు బాగా పెరిగిన ప్రాంతాల్లో మాత్రమే పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలువలు పెరిగే చోట సగటు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అటువంటి చోట్ల రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇకపోతే రాష్ట్రంలో వస్తున్న ఫిర్యాదులు అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు శాఖలో 10 శాతం వరకు గ్రీవెన్స్ లు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
వీటన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే ఆరు నెలల్లో సెప్టెంబర్ నెల మినహాయిస్తే మిగిలిన అన్ని నెలల్లో ఆదాయం వచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పెట్టుకున్న రూ.9,500 కోట్ల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించినట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో జగన్ తన స్వార్థం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చాలా ఇబ్బందులు పెట్టారని, కానీ తాము వారితో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రి అనగాని వివరించారు. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖకు ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధికారులు మంత్రికి వివరించినట్లు చెబుతున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.9,546 కోట్ల ఆదాయం వచ్చింది. 21, 770 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుపుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26 వరకు రూ.6,156 కోట్ల ఆదాయం వచ్చింది. గడిచిన ఏడాదితో పోలిస్తే ఆదాయం తగ్గింది. నిజానికి ఈ ఏడాది రూ.13,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 9 నెలలు పూర్తయినప్పటికీ అందులో సగం ఆదాయం కూడా సాధించలేకపోయారు. జిల్లాల వారీగా అత్యధికంగా విశాఖపట్నం నుంచి రూ.1085 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తరువాత వరుసగా విజయవాడ పరిధిలో రూ.876 కోట్లు, గుంటూరు పరిధిలో రూ.829 కోట్ల ఆదాయం లభించింది. అత్యల్పంగా మన్యం పరిధిలో రూ.27.19 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదన సమర్పించారు.