Heat Waves | వడగాడ్పులు మరో నాలుగు రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
ఈవార్తలు, వెదర్ న్యూస్: కాలు తీసి బయట పెట్టాలంటే వణుకు పుడుతోంది. ఇంటి తలుపు తెరిచినా ఆ గాలి ఒంటిని తాకి కమిలిపోయేలా చేస్తోంది. అంతలా వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సూర్యప్రతాపంతో ఎండలు భగ్గుమంటున్నాయి. గత రెండ్రోజులుగా వడగాడ్పులు ప్రజలను భయపెడుతోంది. ఉదయం 10 దాటితే చాలు ఎండ సెగలు కక్కుతోంది. సాయంత్రం 7 దాటినా భూమిపై ఆ వేడి తగ్గటం లేదంటే ఏ స్థాయిలో ఎండలు కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే, ఈ వడగాడ్పులు మరో నాలుగు రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. తూర్పు భారత దేశంవైపు కూడా హీట్ వేవ్స్ మరో 3 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని తెలిపింది. అనంతరం.. ఉరుముల ప్రభావంతో వేడి గాలుల తీవ్రత తగ్గుతుందని వివరించింది.