రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని కీలక హామీలను అమలు చేస్తుండగా.. గడచిన ఎన్నికల సమయంలో మహిళలపై ప్రభావం చూపించిన ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సూపర్ సిక్స్ హామీల్లో ఇది కీలకమైన హామీగా కూటమి నాయకులు భావిస్తున్నారు. ఈ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని కీలక హామీలను అమలు చేస్తుండగా.. గడచిన ఎన్నికల సమయంలో మహిళలపై ప్రభావం చూపించిన ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సూపర్ సిక్స్ హామీల్లో ఇది కీలకమైన హామీగా కూటమి నాయకులు భావిస్తున్నారు. ఈ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లాలు పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లు అయినా, రోజుకు ఎంత దూరం అయినా ప్రయాణించిన టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికిప్పుడు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలంటే 3,500 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు. కనీసం 2000 కొత్త బస్సులు లేదా అద్దె బస్సులు లేకుండా ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేయలేమని అధికారులు వెల్లడించడంతో.. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది. ఆర్టీసీలో ప్రయాణికుల ఆక్యుపెన్సి రేషియో సరాసరి 69 శాతం వరకు ఉందని, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినట్లు చెబుతున్నారు. ఉచిత ప్రయాణం అమలుతో ప్రభుత్వంపై ప్రతినెల రూ.265 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతోపాటు పంజాబ్, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు తీరును సీఎంకు అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనవరి రెండో తేదీన హోం శాఖ మంత్రి అనిత, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఆర్టీసీ అధికారుల బృందంతో కలిసి కర్ణాటకకు అధ్యయనానికి వెళుతున్నట్లు సీఎంకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఉచిత ప్రయాణం అమలుపై ఎదురైన సవాళ్లు, ఇబ్బందులు గురించి చర్చించినట్లు వెల్లడించారు. త్వరలో తమిళనాడుకు కూడా వెళ్లి అధ్యయనం చేసిన తర్వాత పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని మంత్రి సీఎంకు వివరించారు. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలులో విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర రవాణా కార్పొరేషన్లకు సబ్సిడీ ఇవ్వట్లేదని, గ్రాస్ కాస్ట్ కాంటాక్ట్ (జిసిసి) కింద ఇస్తోందని వెల్లడించారు. అలా తీసుకుంటే అన్ని అద్దె బస్సులే అవుతాయని, ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న సిబ్బంది సేవలు నిరుపయోగంగా మారే అవకాశం ఉందని వివరించారు. కేంద్ర సబ్సిడీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అదనంగా 42 డిపోలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రెండేళ్లలో 568 బస్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తం అధ్యయనం చేసి పూర్తిస్థాయి నివేదికతో మరో మారు రావాలని ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.