స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వెనక్కి తగ్గుతున్నట్లుగా చర్యలు ద్వారా చెప్పకనే చెప్పింది. తాజాగా స్టీల్ ప్లాంట్ కు భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిశ్రమకు కేంద్రం జీవం పోసిన భారీ ఎత్తున నిధులను అందించేందుకు సిద్ధమైంది. రూ.11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అందించేందుకు ముందుకు వచ్చింది.
ఉక్కు పరిశ్రమ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగినట్లు కనిపిస్తోంది. గడిచిన కొన్నాళ్లుగా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించవద్దు అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నెలల తరబడి దీక్షను ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, నిర్వాసితులు కొనసాగించారు. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై వెనక్కి తగ్గలేదు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి, టిడిపి, జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించాయి. ఈ ఎన్నికల సమయంలో విశాఖ ఒక పరిశ్రమను ప్రైవేటీకరించకుండా కాపాడుతామంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో నిర్వహించిన ప్రచార సభల్లో వెల్లడించారు. దీనికి పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి మద్దతు లభించింది. అందుకు అనుగుణంగానే కూటమి పార్టీకి చెందిన అభ్యర్థులను భారీ మెజారిటీతో విశాఖ ప్రజలు గెలిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు కేంద్రంలోని బిజెపిపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వెనక్కి తగ్గుతున్నట్లుగా చర్యలు ద్వారా చెప్పకనే చెప్పింది. తాజాగా స్టీల్ ప్లాంట్ కు భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిశ్రమకు కేంద్రం జీవం పోసిన భారీ ఎత్తున నిధులను అందించేందుకు సిద్ధమైంది. రూ.11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అందించేందుకు ముందుకు వచ్చింది.
ఈ మేరకు తాజాగా కేంద్రం ప్రకటన చేసింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా ఈ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ భేటీ అనంతరం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్యాకేజీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించడం పట్ల ఉద్యోగ సంఘాలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ను మరింత లాభాల బాట పట్టించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ స్టీల్ ప్లాంటును లాభాలు బాట పట్టించేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని కూటమి నాయకులు చెబుతున్నారు.