ఆస్తి వివాదాల నేపథ్యంలో గడిచిన కొద్ది రోజుల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల వివాదంలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న షర్మిలను వైసీపీకి చెందిన ముఖ్య నేతలు లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో.. షర్మిలకు అండగా ఉండేలా మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఆస్తి వివాదాల నేపథ్యంలో గడిచిన కొద్ది రోజుల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల వివాదంలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న షర్మిలను వైసీపీకి చెందిన ముఖ్య నేతలు లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో.. షర్మిలకు అండగా ఉండేలా మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు. హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. దివంగత నేత వైయస్సార్ కుటుంబం ఆస్తులు కోసం తగాదాలూ పడడం బాధాకరమన్నారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని ఈ సందర్భంగా బాలినేని వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు వైయస్ విజయమ్మ ముందుకు రావాలని కోరారు. వేరే వాళ్ళు దీనిలో జోక్యం చేసుకోవద్దంటూ బాలినేని కోరారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్న వైయస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆస్తులు సంపాదించుకొని పార్టీ మారినట్లు కొంతమంది తనపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని.. తాను కొత్తగా ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తన కుమారుడి సాక్షిగా చెబుతున్నానని, వైసీపీలో ఉన్నప్పుడు తన ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప సంపాదించుకోలేదని స్పష్టం చేశారు. ఆ విషయం జగన్ మోహన్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. తనకు సంస్కారం ఉంది కాబట్టే తన గురించి ఎంత ప్రచారం చేస్తున్నా మాట్లాడలేదని స్పష్టం చేశారు. అప్పులయితే తన తండ్రి, కోడలు ఆస్తి ఆమె తీర్చానని, ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసినప్పుడు ఎన్నికలకు ముందే పార్టీలోకి తీసుకుందామని అనుకున్నట్లు చెప్పారని, కానీ జగన్ కు బంధువులు కదా అని అడగలేకపోయానని పవన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తన గురించి ఎప్పుడూ హుందా గానే మాట్లాడారని, వైసీపీలో బాలినేని వంటి మంచి నేతలు ఉన్నారని అప్పట్లోనే చెప్పారన్నారు. జగన్ ఒంగోలు వచ్చి కూడా ఇళ్ల పట్టాల విషయంలో తన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి వదులుకొని జగన్ వెంట నడిచానని, ఆ పార్టీలో తనకు ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. వైయస్ కుటుంబంలో నెలకొన్న వివాదంతో తాను బాధపడుతున్నట్లు స్పష్టం చేశారు. అన్నా, చెల్లెల మధ్య నెలకొన్న సమస్యను తల్లి విజయమ్మ మధ్యవర్తిత్వం చేసి పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. తనపై చేస్తున్న విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు.