శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బిసి) సొరంగంలో పై కప్పు కూలడంతో లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ రెండు రోజులు అయినా ఇప్పటికీ తెలియడం లేదు. చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు ఆర్మీ, జాతీయ విపత్తు రక్షణదళం (ఎన్డీఆర్ఎఫ్) చేపట్టిన ప్రయత్నాలు రెండో రోజు ఫలించలేదు. టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్లి పేర్లు పెట్టి పిలిచిన లాభం లేక పోయింది. సొరంగం మొత్తం బురదమయంగా మారడం, టిబిఎం యంత్రం పైభాగం కుంగిపోవడం, ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండడంతో ముందుకెళ్లలేని పరిస్థితి సిబ్బందికి ఎదురయ్యింది. అయినప్పటికీ భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు వారిని కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బిసి) సొరంగంలో పై కప్పు కూలడంతో లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ రెండు రోజులు అయినా ఇప్పటికీ తెలియడం లేదు. చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు ఆర్మీ, జాతీయ విపత్తు రక్షణదళం (ఎన్డీఆర్ఎఫ్) చేపట్టిన ప్రయత్నాలు రెండో రోజు ఫలించలేదు. టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్లి పేర్లు పెట్టి పిలిచిన లాభం లేక పోయింది. సొరంగం మొత్తం బురదమయంగా మారడం, టిబిఎం యంత్రం పైభాగం కుంగిపోవడం, ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండడంతో ముందుకెళ్లలేని పరిస్థితి సిబ్బందికి ఎదురయ్యింది. అయినప్పటికీ భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు వారిని కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి సైన్యం, ఎన్ డి ఆర్ ఎఫ్ తదితర సిబ్బంది టార్చిలైట్ల వెలుతురులో బృందాలుగా లోపలికి వెళ్తూ రక్షణ చర్యలు ప్రారంభించారు. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్లాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం పలుమార్లు మాట్లాడారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులను అప్రమత్తం చేశారు. రెండు రోజుల నుంచి నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగినప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గర ఉంది పర్యవేక్షిస్తున్నారు.
శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో చోటు చేసుకున్న ప్రమాదం నుంచి బాధితులను కాపాడడం కష్టంగా మారుతోంది. ఘటన జరిగి 60 గంటలు కావస్తున్నప్పటికీ సానుకూల పరిణామాలు కనిపించకపోవడం గమనార్హం. సొరంగం చివరి భాగంలో పనిచేస్తుండగా పైకప్పు కూలిన సమయంలో సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, సంతోష్ సాహు, అనోజ్ సాహూ, జక్తాజస్, సందీప్ సాహూ, మనోజ్ కుమార్, శ్రీనివాస్ ఆచూకీ కనిపించకుండా పోయింది. వీరిలో ఎవరైనా ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చన్న ఆశలు వ్యక్తం అయ్యాయి. ఈ కోణంలో డ్రోన్ తో పాటు స్కానర్లు నైట్ విజన్ కెమెరాలతో దళాలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించాయి. టన్నెల్ బోరింగ్ యంత్రం వద్దకు దాదాపు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ చీకటితోపాటు బురదలో కోరుకుపోయే పరిస్థితి ఉండడంతో వెనక్కి వచ్చేశారు. దూరం నుంచి దగ్గరగా కేకలు వేస్తూ బాధితుల నుంచి స్పందన వస్తుందేమోనని చాలాసేపు ప్రయత్నాలు చేశారు.
బాధితుల నుంచి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియ రాలేదు. టీబీఎం పనిచేసే సమయంలో వచ్చే మట్టి, రాళ్లను భూ ఉపరితలం పైకి తరలించే కన్వేయర్ బెల్టు ఇప్పుడు సహాయ చర్యల సందర్భంగా ఉపయోగకరంగా మారింది. లోకో రైలు సహాయంతో సొరంగంలోకి రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు లోపల వెళ్లేందుకు ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా అధికారులు తొలగిస్తున్నారు. మూడు కిలోమీటర్ల వెనక్కి బురద, నీళ్లు ఎగదన్నాయని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే వెల్లడించారు. ఆ నీటిని భారీ మోటార్లు పెట్టి ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు. మరోవైపు ఉత్తంకుమార్ రెడ్డి సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం నుంచి మూడు హెలికాప్టర్ల ద్వారా నౌకాదళం సభ్యులను ఎల్ఎల్బిసి ప్రాంతానికి పంపించింది. తొలిత ఘటన ప్రాంతాన్ని హెలికాప్టర్ నుంచి ఆధారం పరిశీలించింది. సోమవారం కూడా వీరు రంగంలోకి దిగుతారని సమాచారం. భూగర్భవనంలో రక్షణ చర్యలపై అవగాహన ఉన్న సింగరేణి విపత్తు నిర్వహణ బృందం కూడా పలు పరికరాలతో చేరుకుంది. మొత్తంగా సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ నుంచి 130 మంది, ఎస్డిఆర్ఎఫ్ నుంచి 120 మంది, ఆర్మీ నుంచి 24 మంది, సింగరేణి రెస్క్యూ టీం నుంచి 24 మంది, హైడ్రా నుంచి 24 మంది ఈ ఆపరేషన్ లో భాగంగా ఉన్నారు.