రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసాన్ని సృష్టించి విజయోత్సవాలు నిర్వహించుకోవడమా.? అంటూ భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అయిందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదని, కుంభకోణాల కుంభమేళా జరుపుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.
కేటీఆర్
రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసాన్ని సృష్టించి విజయోత్సవాలు నిర్వహించుకోవడమా.? అంటూ భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అయిందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదని, కుంభకోణాల కుంభమేళా జరుపుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదని, ప్రజావంచన వారోత్సవాలని ఎద్దేవా చేశారు. ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట, కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట అని ఆరోపించారు. బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని, కరప్షన్ కార్నివాల్ జరుపుకోవాలని సూచించారు. ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ గా కాంగ్రెస్ సర్కారు నిలిచిందని, సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామాగా రేవంత్ పాలన అడ్డాగా మారిందని ఆరోపించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలు చేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా.? అని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా? అని నిలదీశారు. ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్ర వీగుతారా అని ప్రశ్నించిన కేటీఆర్.. వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్ లు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను మీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా.? అని కేటీఆర్ నిలదీశారు. పావు శాతం కూడా రుణమాఫీ పూర్తి చేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కు సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా అంటూ కేటీఆర్ నిలదీశారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంటూ ఆగ్రహాలు వ్యక్తం చేశారు కేటీఆర్. ముఖ్యమంత్రికి పాలనపై పట్టు లేదని, ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదని, విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.