ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు టీడీపీకి చెందిన సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇదే డిమాండ్ను పలువురు నేతలు బహిరంగ వేదికలపైనా వ్యక్తం చేస్తున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు టీడీపీకి చెందిన సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇదే డిమాండ్ను పలువురు నేతలు బహిరంగ వేదికలపైనా వ్యక్తం చేస్తున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను తొలుత కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చేయగా.. ఆ తరువాత మిగిలిన నేతలు అందుకుతున్నారు. ఇది కార్యకర్తలు వరకు వెళ్లిపోవడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది.
అదే సమయంలో జనసేన పార్టీ నాయకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వగా లేనిది.. పవన్ కల్యాణ్కు రెండేళ్లపాటు సీఎం పదవి ఇస్తే తప్పేముందంటూ పలువురు జనసేన నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ డిమాండ్ను జనసేన నాయకులు కిరణ్ రాయల్తోపాటు మరికొంత మంది నేతలు వ్యక్తం చేశారు. ఒకవైపు టీడీపీ నాయకులు నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేస్తుంటే, మరోవైపు పవన్ కల్యాణ్కు రెండేళ్లపాటు సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇది కూటమి బంధానికి చేటుగా మారుతుందన్న భావించిన ఇరు పార్టీలు అగ్రనాయకులు నియంత్రణ చర్యలకు సిద్ధమయ్యారు. దీనిపై సోమవారం రాత్రి టీడీపీ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న దానిపై నేతలు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యానించవద్దంటూ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూడా ఎటువంటి పోస్టులు పెట్టవద్దని స్పష్టం చేసింది. దీంతో ఒకవైపు నుంచి ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నాన్ని టీడీపీ చేసింది. మరోవైపు జనసేన కూడా మంగళవారం సాయంత్రం దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేసింది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న దానిపైనా, పవన్ కల్యాణ్కు రెండేళ్లపాటు సీఎం పదవి ఇవ్వాలనే అంశంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుండడంతో జనసేన పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఈ వ్యవహారంపై పార్టీ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూడా ఎటువంటి పోస్టులు పెట్టవద్దని ఆదేశించింది. ఇకపై ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాకూడదని పేర్కొంది. ఏ నిర్ణయమైన కూటమి నేతలు కూర్చుని మాట్లాడుకుంటారని, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది. ఇరు పార్టీలు గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ వివాదంపై కీలక ప్రకటనలు విడుదల చేయడంతోపాటు వివాదానికి ముగింపు పలికినట్టు అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో కూటమి బంధంపై నీలి నీడలు కమ్ముకున్నట్టు అయింది. ఇటువంటి తరుణంలో ఇరు పార్టీలు కీలక ప్రకటనను విడుదల చేయడం ద్వారా పార్టీ నాయకులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం గమనార్హం. ఇది ఒక రకంగా కూటమి పార్టీలు ఒకరికి ఒకరు ఇచ్చుకుంటున్న గౌరవంగానే భావించాల్సి ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఈ వివాదంతో కూటమి బంధం ఏమవుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమైన తరుణంలో.. సరైన సమయంలో పార్టీలు స్పందించిన తీరు పట్ల పలువురు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.