హైడ్రా అధికారులు గడిచిన కొన్నాళ్లుగా సాగించిన కార్యకలాపాలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను రక్షించేందుకు రంగంలోని దిగిన హైడ్రా.. ఇప్పటి వరకు ఆక్రమణదారులు నుంచి వందకుపైగా ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వానికి నివేదికను హైడ్రా అధికారులు సమర్పించారు.
హైడ్రా కూల్చిన నాగార్జున ఎన్ కన్వెన్షన్
తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రా ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. గడిచిన కొద్ది నెలలు నుంచి హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. ప్రముఖులకు సంబంధించిన అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. దీంతో ఒక్కసారిగా హైడ్రా సంచలనంగా మారింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హైడ్రా పేరు మార్మోగిపోతోంది. హైడ్రా తరహా వ్యవస్థను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సాధారణ ప్రజలతోపాటు సామాజిక మాధ్యమాలు వినియోగదారులు నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు గడిచిన కొన్నాళ్లుగా సాగించిన కార్యకలాపాలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను రక్షించేందుకు రంగంలోని దిగిన హైడ్రా.. ఇప్పటి వరకు ఆక్రమణదారులు నుంచి వందకుపైగా ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వానికి నివేదికను హైడ్రా అధికారులు సమర్పించారు. రెండు నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసినట్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేసింది.
ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలను తొలగించిన విషయాన్ని వెల్లడించింది. రామ్నగర్ మణెమ్మ గల్లీలో మూడు, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు హైడ్రా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ హైడ్రాకు కమిషనర్గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, ఎనిమిది మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణలో కూల్చివేత కోసం పని చేయనున్నారు. దీంతో హైడ్రా చర్యలు మరింత వేగవంతం కానున్నాయి. హైడ్రాకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టడంతో పెద్ద పెద్ద వారికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎవరికి మూడుతుందో అన్న చర్చ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.