కూటమిలో రాజుకుంటున్న చిచ్చు.. క్షేత్రస్థాయిలో జనసేన వర్సెస్ టిడిపి

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమిగా ఏర్పాటై పోటీ చేసి విజయం సాధించాయి. వైసీపీపై అద్భుత విజయం సాధించి కూటమి నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై అయిదు నెలలు కావస్తోంది. అయితే, కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో నాయకత్వం సమిష్టిగా పనిచేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు కలిసి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.

TDP vs Janasena

టిడిపి వర్సెస్ జనసేన

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమిగా ఏర్పాటై పోటీ చేసి విజయం సాధించాయి. వైసీపీపై అద్భుత విజయం సాధించి కూటమి నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై అయిదు నెలలు కావస్తోంది. అయితే, కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో నాయకత్వం సమిష్టిగా పనిచేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు కలిసి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అనేకచోట్ల వాగ్వాదాలు, గొడవలు కూటమి నేతల మధ్య చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికుల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే చేయి జారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అగ్ర నేతలు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే చిలికి చిలికి గాలి వానగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన అంతరం మండల స్థాయికి, ఇప్పుడు నియోజకవర్గస్థాయికి చేరిపోయింది. కాకినాడ రూరల్, నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేలు టిడిపి నాయకులను దూరం పెడితే.. ఎర్రగొండపాలెంతోపాటు టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న అనేక నియోజకవర్గాల్లో జనసేన నాయకులను పట్టించుకోవడం లేదు. ఇటువంటి చోట్ల ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు మరింత వేడిని రాజేష్తోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థికి సంబంధించి సమావేశంలో కొంతమంది టిడిపి నాయకులు జనసేన పార్టీ కండువా వేసుకోలేదు. దీంతో జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. ఇది చాలా చిన్న సమస్య. ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల కండువాలను అందరూ కప్పుకున్నారు. ఇప్పుడు కూడా జనసేన శ్రేణులు అభ్యంతరం తెలుపగానే టిడిపి నాయకులు జనసేన పార్టీ కండువాలు ధరించి ఉంటే ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఈ చిన్న విషయానికి ఇరు వర్గాల మధ్య మాటా, మాటా పెరిగి రచ్చకెక్కారు. పెద్దాపురం నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫోటో ముద్రించలేదనే విషయంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో తెలుగు తమ్ముళ్లు, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా కొంత మంది టిడిపి నాయకులు నేరుగా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అనుకూలంగా మారిపోయారని ఆరోపణలు చేశారు.ఇటువంటి చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకుని స్థానిక నాయకులు రచ్చకెక్కుతున్నారు.

కొన్ని పదవులు, చిన్న చిన్న కాంట్రాక్టు పనులు విషయంలో ఈ పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టిడిపి, జనసేన నాయకులు మధ్య సఖ్యత పూర్తిగా లోపించింది. అక్కడ టిడిపి నాయకులు.. జనసేనకు చెందిన నాయకులను కనీసం పరిగణలోకి తీసుకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇరు పార్టీల మధ్య గొడవలకు ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన కొందరు వైసీపీ నాయకులు కూడా కారణమవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన నేతలు జనసేనలో చేరారు. ఇది కొంత ఇబ్బందికరంగా, కూటమి పార్టీల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. వైసీపీ నాయకులు జనసేనలో చేరిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పేర్కొన్నారు. ఈ తరహా ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయిలో నియమించే కమిటీ దోహదపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. మరి దీనిపై అగ్ర నాయకత్వం ఎటువంటి ఆలోచన చేస్తుందో చూడాలి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ గొడవలకు ఎలాంటి పుల్ స్టాప్ లభిస్తుందో చూడాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్