కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రులుగా రాష్ట్రానికి చెందిన పలువురికి అవకాశం దక్కబోతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
పురందేశ్వరి, రామ్మోహన్ నాయుడు
కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రులుగా రాష్ట్రానికి చెందిన పలువురికి అవకాశం దక్కబోతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూటమి 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 50 మందితో కేబినెట్ కూడా ఏర్పాటుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్రంలో మోదీ అధికారాన్ని సాధించడంలో కీలకంగా వ్యవహరించిన రాష్ట్రానికి కూడా కొన్ని కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి మూడు, బీజేపీ, జనసేనకు ఒక్కో కేంద్ర మంత్రి పదవి దక్కనున్నట్టు చెబుతున్నారు. బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముందని చెబుతున్నారు. ఈ మేరకు కొద్ది గంటల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. బీజేపీకి రాష్ట్రం నుంచి రెండో మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావిస్తే.. అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేష్కు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.