|| ప్రతీకాత్మక చిత్రం ||
ఈవార్తలు, ఖమ్మం న్యూస్: ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కన్నెర్ర చేశారు. పొంగులేటి చర్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఆర్.. ఆయనను కలిసిన వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. తిరుగుబాటు చర్యలకు పాల్పడినందుకు వైరా నియోజకవర్గానికి చెందిన 20 మందిపై బహిష్కరణ వేటు వేసింది. వీరిలో అందరూ బీఆర్ఎస్ ముఖ్య నాయకులే. రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా పురపాలక చైర్మన్ జైపాల్తో పాటు మరో 18 మందిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది.
కొన్ని రోజులుగా పొంగులేటికి, బీఆర్ఎస్ అధిష్ఠానం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో నాయకులతో చర్చలు జరుపుతున్న పొంగులేటి.. ఈ మధ్య పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు. అందులోభాగంగానే వైఎస్సాఆర్టీపీ చీఫ్ షర్మిలతోనూ భేటీ అయ్యారు. అంతేకాదు.. ఆదివారం ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనడంపై బీఆర్ఎస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనతో సమావేశమైన నేతలనే పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేయడం గమనార్హం.