అవయవ దానానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పించేలా నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేసిన వ్యక్తి అంతిమ సంస్కారాలను ఇకపై రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చే కుటుంబ సభ్యుల పెద్ద మనస్సుకు గౌరవ సూచకంగా రూ.10,000 కూడా అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అవయవదానం
అవయవ దానానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పించేలా నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేసిన వ్యక్తి అంతిమ సంస్కారాలను ఇకపై రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చే కుటుంబ సభ్యుల పెద్ద మనస్సుకు గౌరవ సూచకంగా రూ.10,000 కూడా అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లేదా జీవన్ దాన్ వద్ద రిజిస్టర్ అయిన ఆసుపత్రిలో సేకరించాక భౌతికకాయాన్ని గౌరవప్రదంగా తరలించే అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలి. మృతుడి అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్ హాజరుకావాలని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ బాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జిల్లా కలెక్టర్ హాజరు కాలేని పక్షంలో ఆర్డీవో స్థాయికి తక్కువకాని అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్దేవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి ఉన్నతాధికారి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా వెల్లడించారు.
మరణించిన దాత కుటుంబ సభ్యులకు గౌరవ చిహ్నంగా శాలువా, ప్రశంసా పత్రం పుష్ప గుచ్చాన్ని ప్రభుత్వ తరఫున అందించాల్సిందిగా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇందుకు వేయి వరకు ఖర్చు పెట్టవచ్చు. అవయవాలను సేకరించాక ఆసుపత్రి నుంచి దాత నివాసం లేదా స్మశాన వాటిక వరకు పార్థివదేహాన్ని ఉచితంగా తరలించే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాత ఫోటో, ఆయన దాతృత్వ వివరాలతో జిల్లా కలెక్టర్ పత్రిక ప్రకటన ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల గత కొన్నాళ్లుగా అవయవ దాన ఉద్యమాన్ని నిర్వహిస్తున్న పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మరింత మంది అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అవయవ దాతలు ముందుకు రాకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అవయవాల కోసం ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ ఎదురుచూస్తున్నారు. తాజా నిర్ణయం వలన ఎక్కువ మంది అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు అవకాశం ఉంటుందని అవయవ దాన ఉద్యమాన్ని నిర్వహిస్తున్న గూడూరు సీతామహాలక్ష్మి వెల్లడించారు.