వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్-2 గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక పదవిని కట్టబెట్టారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రామకృష్ణారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమిస్తూ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నియామకం పట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
వైయస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్-2 గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక పదవిని కట్టబెట్టారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రామకృష్ణారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమిస్తూ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నియామకం పట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారని, అనేక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని పార్టీ ఘోర పరాభవానికి కారణమయ్యారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నాయకుడికి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించడం పట్ల సామాజిక మాధ్యమాలు వేదికగానే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత ముఖ్య నేతలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డికి ఇదే విషయాన్ని వారంతా వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి వ్యవహార శైలి వల్ల, తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ పరాభవం వచ్చిందంటూ పలువురు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి కొన్నాళ్లపాటు కనిపించలేదు.
ఆ తర్వాత మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో దర్శనమిస్తున్నారు. పార్టీని మొత్తం నాశనం చేశారంటూ సామాజిక మాధ్యమాలు వేదికగా వైసీపీ కార్యకర్తలే వారిపై దుమ్మెత్తి పోశారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కనే పెట్టుకున్నారు. తాజాగా రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించడం పట్ల మరింత మంది రగిలిపోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యతలను అప్పగించడం వెనుక వ్యూహం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారి పట్ల కర్కషంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వందలాది మందిని అరెస్టు చేసి వేలాది మందికి నోటీసులను పోలీసులు అందించేలా చేసింది. మరి ముఖ్యంగా అప్పట్లో సోషల్ మీడియా కన్వీనర్ గా వ్యవహరించిన భార్గవ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సజ్జల కుటుంబానికి పార్టీ అండగా ఉందన్న విషయాన్ని తెలియజేసేందుకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన తాము సజ్జల కుటుంబానికి అండగా ఉంటామనే విషయాన్ని చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ కీలక బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి వెనుక లక్షలాదిమంది నాయకులు, కోట్లాదిమంది కార్యకర్తలు ఉండవచ్చు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన మొదటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అన్ని విధాలుగా అండదండలు అందించడంతోనే జగన్మోహన్ రెడ్డి ఆయనను ఆత్మీయ వ్యక్తిగా భావిస్తున్నారని పలువురు చెబుతున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఈ నియామకం పట్ల కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చి ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేయాలని పలువురు చెబుతున్నారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కీలకమైనదే అయినప్పటికీ.. అన్నింటికీ ఆయననే బాధ్యుడిగా చేయడం ప్రస్తుతం కార్యకర్తల్లో అసహనానికి, అసంతృప్తికి కారణమవుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న దానికి మూల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అన్న అభిప్రాయం ఉంది. అనేక అడ్డగోలు నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంలో సజ్జల కీలకపాత్ర పోషించారని.. దాని ఫలితమే అధికారాన్ని కోల్పోయామని భావన కార్యకర్తలు నాయకుల్లో ఉండడంతోనే ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి సజ్జల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. మరి ఆయన నియామకం పట్ల ఆసనం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు దానిని ఏ విధంగా తీసుకుంటారో భవిష్యత్తులో చూడాల్సి ఉంది.